కరోనాపై పోరాటంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుండి సేవలందిస్తున్న వైద్యులకు, పారామెడికల్, ఇతర సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆగస్టు 27, గురువారం నాడు బి.ఆర్.కే.ఆర్ భవన్ లో మంత్రి ఈటల రాజేందర్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, వారి సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు నిమ్స్, టిమ్స్, గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తామని మంత్రి తెలిపారు. నిమ్స్ లో ప్రత్యేకంగా 50 పడకలు ఏర్పాటు చేస్తామని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అందరికీ అక్కడే చికిత్స అందించేలా చూస్తామని అన్నారు. కరోనా చికిత్స అందిస్తూ చనిపోయిన వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి సీఎం కేసీఆర్ కి విన్నవిస్తామని చెప్పారు. ప్రమోషన్ల విషయంలో న్యాయబద్ధంగా రావాల్సిన ప్రమోషన్లు అన్నిటినీ ఇస్తామని హామీ ఇచ్చారు. వివిధ శాఖల విభాగాధిపతిల నుండి వచ్చే ప్రతిపాదనలు ఆలస్యం కాకుండా ముందుగానే తెప్పించుకొని ఏ ఒక్కరూ కూడా నష్టపోకుండా చూస్తామని, దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి ఈటల పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ ఆసుపత్రిలో డాక్టర్స్ పై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని, వారిని వెంటనే అరెస్టు చేయాలని సంఘాల నేతలు మంత్రిని కోరారు. చర్చల సందర్భంగా డాక్టర్లు, లేవనెత్తిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి, వారు ప్రతిపాదించిన చాలా అంశాల పట్ల సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్న అత్యాధునిక చికిత్స వల్ల మరణాల రేటు గణనీయంగా తగ్గిందని, ప్రతి పేషెంట్ కి ఖరీదైన మందులను ఉచితంగా ఇస్తున్నామని మంత్రి.అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని మరోమారు ప్రజలకు సూచించారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు ,సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. కరోనా బారి నుండి తెలంగాణ రాష్ట్రం బయటపడేవరకు అందరూ శక్తివంచన లేకుండా పనిచేయాలని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu