తెలంగాణలో ఎన్నికల వేడి భగ్గుమంటోంది. రేపో.. మాపో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రానుంది. ఈక్రమంలో అన్ని పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్.. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా విజయకేతనం ఎగురవేయాలని కాంగ్రెస్.. సీఎం కుర్చీని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు నేతలు ప్రచారాలతో బిజీ బిజీ అయిపోయారు. ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. ఓ వైపు ప్రజలకు హామీలు గుప్పిస్తూనే.. మరోవైపు పక్క పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు.. సవాళ్లకు ప్రతి సవాళ్లు చేస్తూ హీట్ పెంచుతున్నారు.
తెలంగాణ పర్యటకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలన.. రజాకార్ల పాలనను తలపిస్తోందని భగ్గుమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని వ్యాఖ్యానించారు. అలాగే భ్రష్టాచార్ రిస్తేదార్ సమితి అంటూ బీఆర్ఎస్కు కొత్త అర్థం చెప్పారు. తెలంగాణలో కమలం వికసిస్తుంటే కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.అటు కాంగ్రెస్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ జాతీయ పార్టీలుగా ఎదుగుతుంటే.. కాంగ్రెస్ మాత్రం జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయిందని విమర్శించారు.
ఇకపోతే పార్టీలో అసంతృప్తులను బుజ్జగించేందుకు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ 14 కమిటీలను ఏర్పాటుచేసింది. ఆ కమిటీలకు అసంతృప్తిగా ఉన్న నేతలను ఇంఛార్జ్లుగా నియమించింది.
అయితే బీఆర్ఎస్పై నడ్డా చేసిన కామెంట్లు.. బీజేపీ కమిటీలను ఏర్పాటు చేయడంపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ నిప్పులు చెరిగారు. నడ్డా.. తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డా అని వ్యాఖ్యానించారు. సొంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేని నడ్డా.. తెలంగాణలో గెలిపిస్తారా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హంగ్ ఏర్పడే ఛాన్సే లేదన్న హరీష్ రావు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో బీజేపీని బీఎల్ సంతోష్ భ్రష్టు పట్టించారని.. తెలంగాణలోనూ ఆయన వల్ల బీజేపీ పతనమవడం ఖాయమని వ్యాఖ్యానించారు. అలాగే 14 కమిటీలు కాకుండా డిపాజిట్లు దక్కించుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసుకుంటే.. బీజేపీ పరువైనా దక్కుతుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు.