డొనాల్డ్ ట్రంప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి ట్రంప్ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యం ట్రంప్ వార్తల్లో హైడ్లైన్స్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు రిపబ్లికన్ పార్టీ తరుపున కూడా ట్రంప్ అభ్యర్థుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అయితే మరీ ముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినప్పటి నుంచి.. ఆయన ఎక్కువగా చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. వరుస కేసులు ఆయన్ను వెంటాడుతున్నాయి.
ఇటీవల ఓ కేసులో డొనాల్డ్ ట్రంప్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. వరుస కేసులతో గందరగోళంలో ఉన్న ట్రంప్పై మరో పిడుగు పడింది. మరోసారి ట్రంప్ నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. అమెరికా అణ్వాయుధశాలకు చెందిన పలు అత్యంత రహస్య సమాచారాన్ని తన స్నేహితులకు చేరవేసినట్లు ట్రంప్పై ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికన్ నేవీకి చెందిన ఎలైట్ సబ్మెరైన్ ఫ్లీట్కు సంబంధించిన విషయాలను ట్రంప్ తన స్నేహితుడైన ఆస్ట్రేలియన్ బిలియనీర్ ఆంథోనీ ప్రాట్తో పాటు మరికొంత మందికి చేరవేశారట. ట్రంప్ మరోసారి నేరారోపణలు ఎదుర్కోవడం అమెరికా వ్యాప్తంగా సంచలనంగా మారింది.
అయితే తాజాగా తాను ఎదుర్కొంటున్న ఆరోపణలపై ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సబ్మెరైన్కు చెందిన రహస్య విషయాలు తాను లీక్ చేయలేదని స్పష్టం చేశారు. అవన్నీ పూర్తిగా తప్పుడు ఆరోపణలని.. హాస్యాస్పదమైనవని ట్రంప్ పేర్కొన్నారు. కావాలనే కొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఇప్పటి వరకు ట్రంప్పై మూడు కేసులు నమోదయ్యాయి. పోర్న్స్టార్ డేనియల్స్కు డబ్బు చెల్లింపు అంశానికి సంబంధించి మొదట ట్రంప్పై కేసు నమోదు అయింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ట్రంప్ ఫ్లోరిడా మాన్షన్లో వైట్హౌస్కు సంబంధించిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో మరోసారి ట్రంప్పై రహస్య పత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి నేరాభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి బయటపడేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. అతనిపై మరోసారి నేరాభియోగాలు నమోదయ్యాయి.
2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో ట్రంప్ ఆరోపించారు. ఈ సమయంలో ట్రంప్ మద్ధతుదారులు ఎన్నికల కార్యాలయంపై కూడా దాడి చేశారు. ఈక్రమంలో ఎన్నికల అధికారులు ఇటీవల కోర్టు మెట్లెక్కారు. 2020 ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ట్రంప్ తప్పుడు ఆరోపణలు చేస్తూ.. తమపై ఒత్తిడి తీసుకొచ్చారని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. జో బైడెన్ విజయాన్ని ప్రకటించకుండా అడ్డుకునేందుకు ట్రంప్ మద్ధతుదారులు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ మేరకు ట్రంప్పై దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ట్రంప్పై నేరాభియోగాలు పెరిగిపోవడం సంచలనంగా మారింది. ముందు ముందు ట్రంప్పై మరిన్ని నేరాభియోగాలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.