రాష్ట్రంలో వ్యవసాయ విధానంలో సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సేంద్రీయ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహంపై శాసనమండలిలో సభ్యులు గోరటి వెంకన్న అడిగిన ప్రశ్నకు, సభ్యులు గంగాధర్ గౌడ్, నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. “రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్రం ఆలోచనా ధోరణి మారాలి. పంటలను సమతుల్యం చేయడంలో కేంద్రం బాధ్యత తీసుకోవాలి. పప్పుగింజలు, నూనె గింజలు వంటి పంటలను సమతుల్యం చేయాలి. 1967లో సస్యవిప్లవం తర్వాత దేశంలో పంటసాగులో ఎరువులు, రసాయనాల వాడకం మొదలయింది. దేశంలో ప్రజల ఆకలిని తీర్చేందుకు పంట ఉత్పత్తులు పెంచడంలో భాగంగా నూతన వంగడాల సృష్టి, ఎరువుల ప్రవేశం మొదలయింది. 1967కు ముందు దేశంలోని సాంప్రదాయ వ్యవసాయంలో పశువుల, మేకలు, గొర్రెల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, ఆకులు, అలముల వంటివి మినహా మనదేశంలో ఏ ఎరువులు వినియోగంలో లేవు. అప్పట్లో జ్వరమొస్తే బువ్వ, జేజ కోసం తప్ప ప్రజలకు మిగతా రోజుల్లో గంజి, జొన్న గట్క, రాగి గట్కలే అలవాటు. అప్పుడు ఉన్నతాశయంతో నిర్ణయం తీసుకుని అప్పటి పరిస్థితుల దృష్ట్యా పంటల దిగుబడి పెరిగినా కాలక్రమంలో పంటల సాగులో ఎరువులు, రసాయనాల వాడకం మీద చర్చ జరగలేదు” అని మంత్రి అన్నారు.
“సేంద్రీయ వ్యవసాయం అంటే అదేదో కొత్త విధానం అనుకుంటున్నారు. గ్లైఫోసెట్ అనే గడ్డి మందును తెలంగాణ ప్రభుత్వం నిషేదించింది. అంతర్జాతీయ ఒప్పందాల నేపథ్యంలో రాష్ట్రాలు ఈ విషయంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. కేంద్రం ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. ప్రజలే సొంతంగా మిద్దె తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఈ దిశగా దృష్టి సారించాలి. ఉద్యానశాఖ మిద్దె తోటలకు ప్రోత్సాహం ఇస్తుంది. ఎరువులు, రసాయనాలు వాడొద్దంటే ఎరువుల కొరత ఉందేమో అని పెడార్ధాలు తీస్తున్నారు. విత్తనం నుండి వినిమయం వరకు రైతాంగానికి సంపూర్ణ అవగాహన, చైతన్యం కల్పించాలి. రసాయనిక, ఎరువుల అవశేషాలు లేని పంట ఉత్పత్తులకు అంతర్జాతీయ విపణిలో డిమాండ్ ఉంది. సేంద్రీయ సాగుపై రైతులకు నమ్మకం కలిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కార్యాచరణ చేయాలి. సేంద్రీయ సాగులో ప్రపంచంలో క్యూబా, దేశంలో సిక్కిం రాష్ట్రం అదర్శంగా నిలిచాయి. తెలంగాణలో జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం ఎనబావిలో మహిళా రైతులు 150, 200 ఎకరాలలో సేంద్రీయ సాగు చేస్తున్నారు. వారే సహజ అనే పేరుతో మార్కెటింగ్ చేసుకుంటున్నారు. సేంద్రీయ పంటల మార్కెటింగ్ లో రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. మార్కెటింగ్ ఇబ్బందులు అధిగమిస్తే దీనికి తిరుగులేదు. సేంద్రీయ సాగు ప్రోత్సాహంలో భాగంగా గత ఏడాది 12 లక్షల ఎకరాలకు పచ్చిరొట్ట విత్తనాలు ఉచితంగా అందించడం జరిగింది. పంటలకు మద్దతుధర బాధ్యత కేంద్రానిదే. దేశంలో 29 రకాల పంటలకు కేంద్రం మద్దతుధర ప్రకటిస్తుంది. అలాగే ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటుతో పాటుగా ఒక రైతువేదిక నిర్మాణం చేపట్టాం. నల్లగొండ జిల్లాలో ఐదు వేల ఎకరాలకు మించి ఎనిమిది వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఉన్నది వాస్తవమే. త్వరలోనే రైతువేదికల రేషనలైజేషన్ చేపడతాం” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ