ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) మరియు మీడియా డే మార్కెటింగ్ (MDM) సంయుక్తంగా హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్న ‘ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిషన్’ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఏప్రిల్ 8న లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు ఏప్రిల్ 10 వరకు కొనసాగనుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్ కు సాధారణ ప్రజలకు కూడా అనుమతి ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ లో 100 కంటే ఎక్కువ బ్రాండ్లు తమ ఉత్పత్తులు, సాంకేతికతలు మరియు సేవలను ప్రదర్శిస్తున్నారు. అలాగే, డైరీ మరియు ఫుడ్ సెక్టార్లోని సరికొత్త సాంకేతికతలు, ప్రాసెసింగ్ & ప్యాకేజింగ్ మెషినరీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ మరియు అనుబంధ పరిశ్రమలను ఒకే వేదికపై ఏర్పాటు చేయనున్నారు. ఎక్స్పోతో పాటు నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ కూడా నిర్వహించనున్నారు. పాల సేకరణ, ప్రాసెసింగ్, శీతలీకరణ మరియు పాశ్చరైజేషన్లో డెయిరీ పరిశ్రమలో వస్తున్న మార్పులను ఇక్కడ వివరించనున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్ల వలన పాడి పరిశ్రమపై ప్రజలలో అవగాహన పెరుగుతుందని, తద్వారా ఈ రంగం అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం పశువుల వద్దకే వైద్య సేవలు తీసుకెళ్ళే విధంగా సంచార పశు వైద్యశాలలను ఏర్పాటు చేశామని, దీనివలన ఆ జీవాలకు సత్వర సేవలు అందించగలమని పేర్కొన్నారు. పాడి రైతులకు లీటర్ పాలకు రూ. 4 నగదు ప్రోత్సాహకం అందిస్తున్నామని గుర్తుచేశారు. అలాగే, ఒకప్పుడు నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ ప్రస్తుతం రూ. 650 కోట్ల టర్నోవర్ కు చేరుకుందని, దీనిని 1,000 కోట్ల టర్నోవర్ చేరుకునే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యాచరణతో పని చేస్తుందని మంత్రి తలసాని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ