తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇప్పటికే అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రెండు వర్గాలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతుందని మంత్రి కేటిఆర్ తెలిపారు. ఒకవైపు వారి ప్రాథమిక అవసరాలైన విద్యా రంగంలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూనే మరోవైపు వారి అభివృద్ధి కోసం వారిని పెద్ద ఎత్తున ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో వివిధ శాఖల సెక్రటరీలు మరియు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ లతో కలిసి కేటిఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమీషన్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరంతో పాటుగా వెబ్ సైట్ ను మంత్రి కేటిఆర్, ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటిఆర్ తన ఆలోచనలను పంచుకున్నారు. దేశంలో కులాన్ని మూలధనం తోనే రూపుమాపే అవకాశం ఉన్నదని, ఆ దిశగా సాధ్యమైనంత ఎక్కువ మంది దళిత, గిరిజన వర్గాల నుంచి యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇప్పటికే టీ ప్రైడ్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఈ రెండు వర్గాల యువకులకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సుమారు రెండు వర్గాల్లో కలిపి ఇప్పటికే 36 వేల మంది కి జౌత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు యూనిట్లు ఇచ్చామని తెలిపారు. వీరందరికి త్వరలోనే సబ్సీడీలను అందిస్తామన్నారు. ఈరోజు సూమారు 2000 మందికి అవసరం అయిన 100 కోట్ల సబ్సీడీ మెత్తాన్ని పరిశ్రమల శాఖ తరపున విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులను మంత్రులు చెక్కులను అందించారు.
సమాజంలో ఉన్న వాడు లేడు లేనివారు అనే తేడా ప్రధానంగా మారిందని ఆర్థికంగా అవకాశాలు లేని వారికి అవకాశాలు కల్పించే విధంగా పని చేస్తామని మంత్రి కేటిఆర్ అన్నారు. ఎడ్యుకేషన్, ఏంట్రప్రెన్యూర్ షిప్, ఎంప్లాయిమెంట్ అనే “3E” సూత్రంతో నిమ్న వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టిన భారీ ప్రాజెక్టులు, ఇతర పాలన సంస్కరణ కార్యక్రమాలతో దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని తెలిపిన కేటిఆర్, దళిత, గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా, పెట్టుబడి అవకాశాలు కల్పించే విషయంలోనూ అంతే ఆదర్శంగా ఉండాలి అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అవలంభిస్తున్న కార్యక్రమాలు, చర్యలను పున సమీక్షించి, దేశంలో ఇతర రాష్ట్రాల అవలంభిస్తున్న కార్యక్రమాలన్నింటినీ పైన అధ్యయనం చేసి దేశంలోనే ఆదర్శవంతమైన విధానంతో ముందుకు రావాలని అధికారులకు మంత్రి కేటిఆర్ సూచనలు చేశారు.
తన పరిధిలో ఉన్న పరిశ్రమల శాఖ, మరియు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లు కలిసి ఈ దిశగా పని చేయాలన్నారు. త్వరలోనే మరోసారి సమావేశమవుతామని అధికారులకు సూచించారు. ఆలోగా వినూత్నమైన విధానాలతో ముందుకు వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో మరింత ప్రభావవంతమైన పాలసీలతో ముందుకు పోదామని సూచించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పథకాలు, కార్యక్రమాల ద్వారా దళిత, గిరిజన యువకులకున్న అవకాశాలపైన అన్ని జిల్లాల్లో అవగాహన మేళాలు నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పడిన నాటి నుంచి చేపట్టిన చర్యలను మంత్రి కేటిఆర్ అభినందించారు. ముఖ్యంగా దళిత గిరిజనులపైన జరుగుతున్న అట్రాసిటీ కేసులను పరిష్కరించి, వారికి తక్షణ సహకారం అందించడం వంటి చర్యలను ప్రశంసించారు. తమకు అప్పజెప్పిన బాధ్యతలను నిబద్దతతో ముందుకు తీసుకుపోతున్న కమిషన్ చైర్మన్, సభ్యులను అభింనందించారు. ముఖ్యంగా ఈ విషయంలో కమిషన్ సభ్యులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవడాన్ని మంత్రి అభినందించారు
ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, బాగా పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. గతంలో కూడా కమిషన్లు ఉన్నా, మొక్కుబడిగా ఉండేవని, రాజకీయ నాయకుల పునరావాసంగా ఉండేవని, కానీ సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు నేడు ఈ కమిషన్ పని చేయడం సంతోషంగా ఉందన్నారు.
అలాగే మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళిత, గిరిజన అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ పరిధిలో వచ్చే అన్ని సమస్యలను నేరుగా మనమే చొరవ తీసుకొని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. వారి నమ్మకాన్ని ఈ ప్రభుత్వం పట్ల మరింత పెంచే విధంగా కృషి చేయాలని కమీషన్ కు సూచించారు. సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకం పెట్టి గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా మార్చుతున్నామని, ఎక్కువ మంది గిరిజన యువకులను పారిశ్రామిక వేత్తలు చేయడానికి పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu