రంజాన్ మాసం సమీపిస్తున్న సందర్భంగా మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో పలు ప్రభుత్వ శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రమని, ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప లౌకికవాది అని పేర్కొన్నారు. “సీఎం అన్ని కులాలు, మతాలను సమదృష్టితో చూస్తున్నారు, గౌరవిస్తున్నారు. అన్ని ప్రధాన పండుగలు, జాతరలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరుస్తున్నది. రంజాన్ పవిత్ర మాసాన్ని, పేదలకు దుస్తుల పంపిణీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే విందును, పండుగను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకుందాం. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు శ్రద్ధాసక్తులతో చూసుకోవాలి, పూర్తి చేయాలి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు.
“మసీదులు, ఈద్గాలకు అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలి. రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులను పూర్తి చేయాలి. నీళ్లు, విద్యుత్ సరఫరాలకు ఎటువంటి కొరత రాకుండా చేసుకోవాలి. అవసరమైన పాలు, చక్కర, బియ్యం, వంట గ్యాస్, ఇతర నిత్యావసరాలు అందుబాటులో ఉండాలి. వీధి దీపాలన్నీ కూడా వెలిగే విధంగా చూసుకోవాలి. ప్రధానమైన మసీదులు, ఈద్గాల వద్ద మూత్రశాలలు నిర్మించాలి. ముఖ్యమంత్రి విందు రోజు, పండుగ నాడు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. పరిసరాల పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. పేదలకు పంపిణీ చేసే దుస్తులను పండుగకు చాలా ముందేగానే అందజేయాలి. రాత్రి వేళల్లో తెరచి ఉన్న హోటళ్లు, షాపులను బంద్ పెట్టమని వత్తిడి చేయొద్దు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి. ఏప్రిల్ 3వ తేదీన మొదలయ్యే ఈ పవిత్ర మాసం, ముఖ్యమంత్రి కేసీఆర్ విందు, పండుగ ఘనంగా జరిగేలా మనమందరం అంకితభావంతో పని చేద్దాం” అని రాష్ట్ర మంత్రులు అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశానికి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ఎమ్మెల్సీలు సయ్యద్ అమీన్ ఉల్ జాఫ్రీ, సయ్యద్ రియాజ్ ఉల్ హసన్, ఎమ్మెల్యేలు కౌసర్ మొయినుద్దీన్, మౌజంఖాన్, అహ్మద్ బిన్ బలాల, అహ్మద్ పాషా ఖాద్రీ, జాఫర్ హుస్సేన్ మీరాజ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ కార్యదర్శి నదీమ్ అహ్మద్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఐపిఎస్ అధికారి చౌహాన్, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ