గత కొన్నిరోజులుగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి, నిర్వహణపై కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ గురువారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ గెజిట్ అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపారు. ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులున్న ప్రాజెక్టులన్ని కృష్ణా బోర్డు పరిధిలోకి చేరుతాయి. కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులను ఈ రెండు బోర్డుల పరిధుల్లోకి చేర్చారు.
ఇక రెండు రాష్ట్రాలు కూడా ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్ మనీ కింద డిపాజిట్ చేయాలి. అలాగే నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలలలోపుగానే ఆయా పరిధుల్లో అనుమతిలేని ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతులు తెచ్చుకోవడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా కూడా వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని చెప్పారు. కృష్ణా, గోదావరి బోర్డులకు చైర్మన్లుగా, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజినీర్లు ఇకపై ఇతర రాష్ట్రాలకు చెందినవారు నియామకం కానున్నారు. ప్రాజెక్టులలో నీళ్లు మరియు విద్యుదుత్పత్తి, సిబ్బందిని ఇకపై బోర్డులే పర్యవేక్షించనున్నాయి. బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలూ భరించాల్సి ఉండగా, ఉమ్మడి ప్రాజెక్టులు, కెనాల్స్ వద్ద కేంద్ర బలగాలైన సీఐఎస్ఎఫ్ ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ జెన్కోకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు మౌంతాంగ్ తెలంగాణ జెన్కో కు లేఖ రాశారు. అలాగే ఆర్డీఎస్ కుడికాల్వ పనులు కొనసాగించవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నికేఆర్ఎంబీ కోరింది. ఈమేరకు బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా ఏపీ ఈఎన్సీకి గురువారం నాడు లేఖ రాశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ