పార్లమెంట్లోకి ఆగంతకులు చొరబడి టియర్ గ్యాస్ లీక్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉభయ సభలను ఈ ఘటన కుదిపేస్తోంది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని విపక్ష ఎంపీలు పట్టుపట్టారు. ఈక్రమంలో ఉభయ సభల్లో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో.. ఇప్పటి వరకు 146 మంది విపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయినప్పటికీ విపక్షాలు పట్టు విడవడం లేదు. ఈ ఘటనపై అమిత్ షా వివరణ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి.
మరోవైపు విపక్ష ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేయడంపై ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో పెద్ద ఎత్తున ఇండియా కూటమి నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ.. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద టి.కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. పార్లమెంట్ ఘటనపై ప్రశ్నించినందుకు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
అనేక మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని.. అటువంటి దేశంలో ఇప్పుడు అరాచక పాలన కొనసాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్లమెంట్పై దాడి అంటే దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్లేనని అన్నారు. పార్లమెంట్లోకి ఆగంతకులు చొరబడి అలజడి సృష్టించిన ఘటన దేశం మొత్తం చూసిందన్న భట్టి.. అసలు ఏమీ జరగలేదనట్లు ప్రధాని మోడీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశ రక్షణను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ గాలికొదిలేసిందని ఆరోపించారు. పార్లమెంట్నే రక్షించలేని పాలకులు.. దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తారా..? అని ప్రశ్నించారు. 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్న భట్టి విక్రమార్క.. ప్రజాస్వాసమ్యాన్ని ప్రజలంతా కాపాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE