తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల మరణించిన మాజీ శాసన సభ్యుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి, సుజాత నగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య, బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ఎం.సత్యనారాయణరావు, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథంలకు శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాల అనంతరం శాసనసభను సెప్టెంబర్ 27, సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన శాసనమండలి కూడా సంతాప తీర్మానాల అనంతరం సోమవారానికి వాయిదాపడింది.
గత మార్చి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల అనంతరం దాదాపు ఆరునెలల అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకానికి చట్టబద్దత కల్పించే బిల్లు, జల వివాదాలు, ఉద్యోగాల భర్తీ, ధాన్యం కొనుగోలు సహా కొన్ని ఆర్డినెన్స్లకు చట్టబద్దత కల్పించడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశమునట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ