ప్రపంచ మహిళల బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడం ద్వారా పీవీ సింధు దేశానికే గర్వకారణంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. సింధు భవిష్యత్తులో ఇంకా అనేక టోర్నమెంట్లలో పాల్గొనాలని, ఒలంపిక్స్ కు వెళ్లాలని, భవిష్యత్తు టోర్నమెంట్లకు సమాయత్తం కావడానికి, ఇతరత్రా ఏర్పాట్లకు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పీవీ సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీ చంద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి నాథ్ సీఎం ను కలిశారు. తనకు వచ్చిన మెడల్ ను సీఎంకు పీవీ సింధు చూపించారు. రెండు రాకెట్లను సీఎంకి బహుకరించారు. సింధుకు పుష్పగుచ్చం ఇచ్చి, షాలువా కప్పి సీఎం సన్మానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్ షిప్ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయుల్లో ఒక్కరుగా నిలిచారు. ఇది మనందరికీ గర్వకారణం. ఇలాంటి ఘనతలు సాధించడం ఆషామాషీ విషయం కాదు. కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరం. ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థితికి చేరుకోవడం సాధ్యం కాదని చెప్పారు. స్వతహాగా జాతీయ క్రీడాకారులైన రమణ దంపతులు తమ కూతురును గొప్పగా తీర్చిదిద్దారు. గోపీ చంద్ చక్కగా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు అంతర్జాతీయ విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారుతోంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్, మహేష్ భగవత్, ఇంటలిజెన్స్ ఐజీ నవీన్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
[subscribe]
[youtube_video videoid=D5P0IbVrf-s]