తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలు అన్నీ కలిపి కోటి రూపాయల వరకు నిధులను అందిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం 5వ విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లూరు గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఇంకా గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామం అభివృద్ధికి ఎన్నో పథకాల ద్వారా అవసరమైన నిధులను సమకూర్చుతోందని, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలు అన్నీ కలిపి కోటి రూపాయల వరకు నిధులను అందిస్తున్నామని వెల్లడించారు. గత 70 ఏళ్ల కాలంలో చూడని అభివృద్ధి కేవలం 8 ఏళ్లలోనే సీఎం కేసీఆర్ సాధించారని తెలిపారు. గత ప్రభుత్వాల పాలనకు, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు తేడాను గుర్తించాలని ప్రజలకు సూచించారు. గ్రామం లోని మహిళలకు స్త్రీ నిధి కింద రూ. 3 లక్షల వరకు నిధులు అందజేస్తామని, గ్రామం నుంచి బడి పిల్లల కోసం ప్రత్యేకంగా బస్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీనిచ్చారు.
అలాగే గ్రామంలోని అంతర్గత రోడ్ల కోసం 40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎర్రబెల్లి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీరు, డ్వాక్రా మహిళలకు నిధులు, రుణాలు, రైతు బంధు, దళితబంధు.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం విపరీతంగా మెరుగుపడడంతో గ్రామాల్లో వ్యాధులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని అన్నారు. 57 ఏళ్లు దాటిన వారికి పింఛను అందించే కొత్త పింఛను పథకం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుందని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF