చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటిటెస్టులో భారీ స్కోర్ సాధించిన భారత జట్టు పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ (152 బంతుల్లో 110 -10 ఫోర్లు, 3 సిక్స్లు), చటేశ్వర్ పుజారా (130 బంతుల్లో 102 -13 ఫోర్లు) సెంచరీలు చేయడంతో భారత జట్టు భారీ ఆధిక్యత సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు రెండు వికెట్స్ కోల్పోగా, ఇన్నింగ్స్ ను 61.4 ఓవర్లలో 258/2 వద్ద డిక్లేర్డ్ చేసింది. 258/2 వద్ద డిక్లేర్ చేయడంతో మొదటి ఇన్నింగ్స్ లో 254 పరుగుల ఆధిక్యం కలుపుకుని భారత జట్టు మొత్తం 512 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ముందుగా మూడో రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ ఓవర్ నైట్ స్కోర్ 133/8 తో ఆటను ప్రారంభించింది. కేవలం మరో 17 పరుగులు మాత్రమే జత చేసిన బంగ్లాదేశ్ తోలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్ల తీసి (5/40) అద్భుత ప్రదర్శన చేశాడు. బంగ్లా జట్టులో తోలి ఇన్నింగ్స్లో ముష్ఫికర్ రహీమ్ (28), జకీర్ హసన్ (20), లిటన్ దాస్ (24), మెహదీ హాసన్ మిరాజ్ (25) మాత్రమే కొద్దీ పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 5, సిరాజ్ 3, ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. భారత్ తోలి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 150 పరుగులు మాత్రమే చేయడంతో ఫాలో ఆన్ గండం తప్పించుకోలేకపోయింది. అయితే బంగ్లాను ఫాలో ఆన్ ఆడించకుండా, రెండో ఇన్నింగ్ ఆడేందుకే భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ మొగ్గు చూపాడు.
దీంతో రెండో ఇన్నింగ్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (23) పరుగులకే ఔటైనప్పటికీ, మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ చెలరేగి ఆడి తన కెరీర్ లో టెస్టుల్లో మొదటి సెంచరీ సాధించాడు. 147 బంతుల్లో సెంచరీ సాధించిన గిల్, 110 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం పుజారా కూడా కీలక ఇన్నింగ్ ఆడుతూ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కేవలం 130 బంతుల్లోనే 13 ఫోర్లతో సెంచరీ సాధించాడు. మొదటి ఇన్నింగ్స్ లో పుజారా 90 పరుగుల వద్ద అవుట్ అవ్వగా, రెండో ఇన్నింగ్స్ లో ఎలాంటి తప్పుకు తావు ఇవ్వకుండా సెంచరీ బాదాడు. 1,443 రోజులు, 52 ఇన్నింగ్స్ల తర్వాత పుజారా టెస్టుల్లో సెంచరీ సాధించడం విశేషం. అది కూడా టెస్టుల్లో తన వేగవంతమైన సెంచరీ (130 బంతులు) నమోదు చేశాడు. మరోవైపు పుజారాతో పాటుగా విరాట్ కోహ్లీ 19 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. పుజారా సెంచరీ అనంతరం కెప్టెన్ రెండో ఇన్నింగ్స్ ను 258/2 వద్ద డిక్లేర్డ్ చేశాడు, దీంతో విజయం కోసం బంగ్లాదేశ్ 192 ఓవర్లలో 513 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకో రెండ్రోజులు ఆట మిగిలి ఉండగా, బంగ్లాదేశ్ ప్రస్తుతానికి 12 ఓవర్లలో 42 పరుగుల చేసింది. క్రీజులో నజముల్ హుస్సైన్ (25*), జాకిర్ హాసన్ (17*) ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE