తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన హస్తం పార్టీ అదే జోష్తో త్వరలో రానున్న పార్లమెంటు సీట్లపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని..ఓ రెండు పార్లమెంటు స్థానాలను మళ్లీ కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ కసరత్తులు ప్రారంభించింది. అయితే నల్లగొండ జిల్లాలో ఎంపీ టికెట్ల కోసం ఇప్పుడు యువ నేతలు పోటీ పడుతుండటంతో.. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలకు ఈ ఎన్నికలు సవాల్ గా మారబోతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలలో 11 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసేసుకుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కీలక మంత్రులుగా జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 2 పార్లమెంటు స్థానాల్లో హస్తం పార్టీ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు కూడా ఆ రెండు ఎంపీ స్థానాలను తిరిగి కైవసం చేసుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో అక్కడి పరిస్థితులపై చర్చించారు.
ఈ లోక్ సభ ఎన్నికలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రతిష్టాత్మకంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లు మాత్రమే గెలుపొందింది. కానీ 2019 ఎంపీ ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు ఎంపీలుగా విజయం సాధించారు. ఇపుడు ఏకంగా తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ రెండు సీట్లను మరోసారి స్వీప్ చేసి ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని మంత్రులు గెలుపు బాధ్యతను భుజాన వేసుకుంటున్నారు.
ఒకవైపు ఆశావహులు ఎంపీ టికెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సీనియర్ నేతలతో పాటు యువ నేతలు కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. నల్లగొండ ఎంపీ నియోజకవర్గ పరిధిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్యనే పోటీ జరిగినా కూడా ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఇక్కడా ఖాతా తెరవలేదు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో హస్తం పార్టీకి బాగా పట్టుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింటిలో ఆరింటిని హస్తగతం చేసుకుంది.
ప్రస్తుతం.. సీనియర్ నేత జానారెడ్డి పెద్ద కుమారుడు కుందూరు రఘువీర్రెడ్డి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెటను ఆశించి భంగపడిన పటేల్ రమేష్ రెడ్డికి అప్పట్లో ఎంపీ టికెట్ ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది.దీంతో పటేల్ రమేష్ రెడ్డి కూడా ఇప్పుడు ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో జానారెడ్డి తనయుడుగా రఘువీర్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతోందట. అటు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీ నియమించింది.
మరోవైపు భువనగిరి టికెట్ కోసం కూడా గట్టిపోటీనే ఉంది. ముఖ్యంగా యువనేతలు ఈ పోటీలో ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి అనుచరుడు, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్రెడ్డి ఈ రేసులో ముందు వరుసలో ఉన్నారు. అలాగే భువనగిరి టికెట్ను కోమటిరెడ్డి కుటుంబం నుంచి కూడా ఒకరు ఆశిస్తున్నారట. అలాగే బీసీ కోటాలో సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఎంపీ రేసులో ఉన్నారు. ఇంత టఫ్ సీన్ ఉణ్న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో.. అభ్యర్థుల ఎంపికే కత్తిమీద సాములా తయారయింది. మరి సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఏం చేస్తారో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE