తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక నవంబర్ 30న మూడో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల ప్రక్రియ ముగిశాక.. 2019 జనవరి 15వ తేదీ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి 2024 జనవరి 16 తో గడువు ముగియనుంది. సీఈసీ షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 30న ఒకే తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. తర్వాత డిసెంబర్ 3 అంటే ఆదివారం రోజు కౌంటింగ్ జరిగి.. ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను.. సీఈసీ అక్టోబర్ 9న ప్రకటించి.. తక్షణమే ఎన్నికల కోడ్ను అమలు చేసింది. తర్వాత నవంబర్ 3న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు గెజిటెడ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయగా.. నోటిఫికేషన్ విడుదల అయిన కాసేపటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అలా వారం పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సాగి నవంబర్ 10 తో ముగిసింది. ఆ తర్వాత నవంబర్ 13 వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టగా..నవంబర్ 15 తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది.
ఇక అన్ని పార్టీల ఎన్నికల ప్రచారం నవంబర్ 28 సాయంత్రంతో ముగుస్తుంది. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3వ తేదీ కౌంటిగ్.. అదే రోజు ఫలితాల వెల్లడి అవుతాయని నోటిఫికేషన్లో ఈసీ చెప్పింది. మొత్తంగా డిసెంబర్ 5 లోపు తెలంగాణ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని..ఎస్ఈసీని సీఈసీ ఆదేశించింది.
తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35వేల 356 పోలింగ్ కేంద్రాల్లో నవంబర్ 30న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీనిలో వెబ్క్యాస్టింగ్ ఉండే కేంద్రాలు 78శాతం ఉన్నాయి. అంటే 27,798 , 597 మహిళా పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎలక్షన్స్ కోసం జనరల్ అబ్జర్వర్లు 67 మంది , పోలీస్ అబ్జర్వర్లు 39 మందిని ఈసీ నియమించింది . నవంబర్ 30న ఉదయం ఏడు గంటల నుంచి.. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది . అయితే ఈసీ గుర్తించిన 13 సమస్యాత్మక ప్రాంతాలలో మాత్రం గంట ముందుగానే పోలింగ్ ముగిసేలా ఏర్పాట్లు చేసింది.
ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య తాజాగా 3,26,18,205కు చేరుకుంది. అయితే ఈ లిస్టు ప్రకారం అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో మహిళా ఓటర్లు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి తయారయిన లిస్టులో పురుషులు 1,62,98,418 మంది, మహిళలు 1,63,01,705 మంది ఉన్నారు. అక్టోబరు 4న ప్రకటించిన జాబితాలో మహిళా ఓటర్ల కంటే పురుషులు 28,154 మంది ఎక్కువగా ఉండగా.. తాజాగా దాన్ని మహిళా ఓటర్లు అధిగమించారు. పురుష ఓటర్ల కన్నా 3,287 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా నమోదయ్యారు.
తెలంగాణలో మొత్తంగా రికార్డుస్థాయిలో 9,99,667 మంది నవ ఓటర్లు నమోదయి 10 లక్షలకు చేరువ అయ్యారు . అక్టోబరు 4న ప్రకటించిన జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల వయసు గల ఓటర్లు 8,11,648 మంది ఉండగా.. అక్టోబరు 31 తర్వాత మరో 1,88,019 మంది నమోదయి ఎన్నికల అధికారులను ఆశ్చర్యంలో పడేశారు. అయితే మొత్తం ఓటర్లలో ట్రాన్స్జెండర్లు 2,676 మంది, సర్వీసు ఓటర్లు 15,406 మందిగా నమోదయినట్లు ఈసీ తెలిపింది. మొత్తం ఓటర్లలో 59 సంవత్సరాల లోపు వాళ్లు 86 శాతం ఉండగా.. 80 ఏళ్ల వయసు దాటిన వాళ్లు 4,40,371 మంది ఉన్నారు.
అత్యధికంగా హైదరాబాద్లో 45, 36, 852 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,26,574 మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7, 32, 560 మంది ఓటర్లు ఉండగా.. అతి తక్కువగా భద్రాచలం నియోజకవర్గంలో 1,48, 713 మంది ఓటర్లు ఉన్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం మొత్తం 4,798 మంది నామినేషన్లు వేయగా.. స్క్రూటినీ తర్వాత 2వేల898 మంది నామినేషన్లకు ఆమోదం లభించింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత చివరకు 2,290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో 48 మంది, కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్లో 44 మంది.. కామారెడ్డిలో 39 మంది పోటీలో మిగిలారు. అత్యల్పంగా నారాయణపేట జిల్లా నారాయణపేటలో ఏడుగురు, కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో ఏడుగురు చొప్పున అభ్యర్థులు, నిజామామాద్ జిల్లాలోని బాల్కొండలో 8 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE