తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా కింద జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరపున ఎంపికైన ముగ్గురు అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేశారు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కే నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డిలను ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ఈరోజు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులకు సమర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డిలు హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ఇక నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ముందు ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు గన్పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
కాగా 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో 100 మందికి పైగా సభ్యులు ఉండడంతో బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక నవీన్ కుమార్ను అధికార పార్టీ మరో దఫా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వగా.. దేశపతి శ్రీనివాస్, వెంకట్రామి రెడ్డి కొత్త అభ్యర్థులు. అయితే వీరిలో కవి, గాయకుడు శ్రీనివాస్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ డ్యూటీ అధికారిగా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. ఇక వెంకట్రామిరెడ్డి అలంపూర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు మార్చి 13 వరకు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. అలాగే మార్చి 14న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు గడువు అభ్యర్థిత్వం మార్చి 16 వరకు ఉంటుంది. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు మార్చి 23న జరగనున్నాయి. అదేరోజు సాయంత్రానికి ఫలితాలను వెల్లడిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE