ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (మే 26, గురువారం) హైదరాబాద్ నగరంలో పర్యటించిన విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి) 20వ వార్షికోత్సవ వేడుకలు మరియు 2022 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ క్లాస్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఇక్కడ ప్రజల ఆకాంక్షలు, ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీలు, అవి అమలుకు నోచుకోని వైనాన్ని మీ దృష్టికి తెస్తున్నానని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పెవికాల్ సంబంధం ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో మాత్రం రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని, రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, రైతులు, యువత ఎదుర్కొంటోన్న సమస్యలపై రెండు ప్రభుత్వాలకు కనీసం పట్టడం లేదనిపిస్తోందని, విభజన చట్టంలోని హామీల సాధనకై కంఠశోషే తప్ప కార్యచరణలోకి మాత్రం రావడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
“బీజేపీ-టీఆర్ఎస్ మధ్య చీకటి సంబంధం చాలా బలంగా ఉన్నదనే ఇప్పటికీ తెలంగాణ సమాజం నమ్ముతోంది. తాజాగా విద్యుత్ సంస్కరణలు, విద్యా సంస్కరణల విషయంలో మీ ప్రభుత్వ జాతీయ విధానాన్ని పైకి వ్యతిరేకిస్తూ, అంతర్లీనంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం దీనికి నిదర్శనం. బీజేపీ-టీఆర్ఎస్ లు పైకి ఉప్పు నిప్పు అన్నట్టుగా ఆడుతున్నరాజకీయ క్రీడ ఒక డ్రామా అని ప్రజలు భావిస్తున్నారు” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ప్రజల పక్షాన ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుండి 9 అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.
గడచిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తూ మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరమని, ఇప్పటికైనా ఆ మాటలను వెనక్కు తీసుకుని, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ఎలా ఉపేక్షిస్తున్నారు?, ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించడానికి ఇబ్బంది ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు, ఐటీఐఆర్ ప్రాజెక్టు, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న నష్టం, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం, ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణ, బాయిల్డ్ రైస్, యాసంగి ధాన్యం కొనుగోలు, రామాయణం సర్క్యూట్ ప్రాజెక్టులో భద్రాచలంకు చోటు కల్పించకపోవడం సహా పలు అంశాలపై ప్రధాని మోదీకి రాసిన బహిరంగ లేఖలో రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF