తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఏమాత్రం ఊహించని విధంగా.. కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమా నెవ్వర్ అనేవాళ్లకు సమాధానంగా వచ్చిన ఫలితాలు హస్తం పార్టీదే అధికారమని తేల్చేశాయి. అయితే నిన్న వెలువడ్డ ఫలితాలు ఓటర్లు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ అధికార పార్టీల్లోకి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు భారీ షాక్ ఇచ్చాయి.
2018లో జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత.. తెలంగాణలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీపార్టీలోకి చేరిపోయారు. బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగిన ఎమ్మెల్యేలు.. సొంత పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా కారెక్కేశారు. అలాగే ఈ ఐదేళ్లూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా చెలామణి అవడమే కాకుండా.. కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగానూ కొనసాగారు. అలా గోడ దూకిన వారందరికీ ఇప్పుడు తెలంగాణ ఓటర్లు భారీ షాకిచ్చారు.
డిసెంబర్ 3న వెలువడ్డ తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో గతంలో బీఆర్ఎస్లోకి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేల్లో 10 మందికి ఓటర్లు వాతలు పెట్టారు. ఇందులో ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్, తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి, పినపాకలో రేగా కాంతారావు, కొల్లాపూర్ లో బీరం హర్షవర్ధన్ రెడ్డి, నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి,కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందులో హరిప్రియ నాయక్, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి , అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వర రావు ఓటమి పాలయ్యారు.
ఇక కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారిలో ఇద్దరకి మాత్రమే తెలంగాణ ఓటర్లు విజయాన్ని అందించారు. వీరిలో మహేశ్వరం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ ఎన్నికలలో గెలిచారు. వీరిద్దరూ తప్ప మిగిలిన వారంతా ఓటమి పాలవ్వడంతో.. ఓటర్లు ఫిరాయింపు రాజకీయాలను ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడలేదన్న వాదన వినిపిస్తోంది . అయితే మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం వీరందరికీ బుద్ధి చెప్పి ఈ ఎన్నికలలో ఓడించడానికి కాస్త ఎక్కువగా కసరత్తు చేసిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE