ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లోని ‘లేపాక్షి ఆలయం’ చోటు దక్కించుకుంది. ప్రపంచంలోని చారిత్రక కట్టడాలకు వారసత్వ గుర్తింపు ప్రకటించే యునెస్కో సంస్థ అనంతపురం జిల్లాలోని పురాతన లేపాక్షి ఆలయాన్ని వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చింది. లేపాక్షి ఆలయంతో పాటు భారతదేశం లోని మరో రెండు ప్రాంతాలకు ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. ఇలా యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారి కావడం గమనార్హం. అయితే, ఇలా ఎంపికైన కట్టడాల మొత్తం జాబితాను పరిశీలించిన తరువాత మరో ఆరు నెలల్లో తుది జాబితాను వెల్లడించనున్నారు. ఆ సవరించిన జాబితాలో లేపాక్షి ఆలయం చోటు దక్కించుకోగలిగితే ప్రపంచ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుంది.
అరుదైన శిల్ప కళలతో, చూపరులను కట్టిపడేసే సౌందర్యంతో అలరారే లేపాక్షి ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాశస్థ్యం ఉంది. ఈ పవిత్ర క్షేత్రం లోని మూలవిరాట్టు వీరభధ్ర స్వామి. ఆలయం ముంగిట కూర్చున్న భంగిమలో ఉండే లేపాక్షి బసవన్న భారీ విగ్రహం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. గాలిలో వేలాడుతున్నట్లుండే రాతి స్తంభం, సప్తశిరస్సులతో పడగ విప్పి దర్శనం ఇచ్చే నాగదేవత ఇక్కడి అద్భుతాలు. అలాగే నిత్యం సీతమ్మవారి పాదాల నుంచి జాలువారే జలధార మరో విశేషం. సుమారు 5 వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ ఆలయానికి అప్పట్లోనే భారీగా ధనం వెచ్చించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ