ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 21, మంగళవారం నాడు పాఠశాల విద్య, జగనన్న గోరుముద్ద పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా విధానానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎల్కేజీ, యూకేజీ విద్య అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను పీపీ-1, పీపీ-2గా అమలు చేయాలని చెప్పారు. అలాగే ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ రూపొందించాలని సూచించారు.
పీపీ-1, పీపీ-2 లో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని, ఈ క్రమంలో ఒకటో తరగతి నుంచి బోధించే పాఠ్యాంశాలతో ప్రీప్రైమరీ పాఠ్యంశాలకు సంబంధం ఉండేలా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో పాఠశాలల పక్కనే అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసే అంశం, రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల పరిస్థితులు, మండలానికో హైస్కూల్ను జూనియర్ కాలేజీగా మార్చడం, జూనియర్ కాలేజీల్లో ఖాళీ భర్తీ, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక భవనం ఏర్పాటు చేసే అంశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu