కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27, సోమవారం నాడు అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు భారత్ బంద్ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తూ, ఆందోళన ప్రారంభించి 10 నెలలు పూర్తవుతున్న సందర్భంగా రైతులు భారత్ బంద్ కు పిలుపు నిచ్చారు. రైతులు ఇచ్చిన బంద్ పిలుపుకు ఇప్పటికే పలు పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. అందులో భాగంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కూడా అదేరోజున భారత్ బంద్ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, కార్మికులు తలపెట్టిన భారత్ బంద్ కు ఏపీ రాష్ట్రప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
భారత్ బంద్ నేపథ్యంలో సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 27 మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆ తర్వాత నుండి బస్సులు యథావిధిగా నడుస్తాయని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, అలాగే రైతుల సమస్యలను కేంద్రం పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. మరోవైపు ఈ బంద్ లో అన్నివర్గాల వారు శాంతియుత పద్దతిలో నిరసన తెలపాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ