దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి రాష్ట్రాలను సిద్ధం చేయడానికి మరియు ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాల సంసిద్ధతను అంచనా వేయడానికి మొదటి దశలో నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ (వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం) నిర్వహణకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. డిసెంబర్ 28, 29 తేదీలలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలను డ్రైరన్ కోసం ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఆంధప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ సోమవారం ఉదయం మొదలైంది. కృష్ణా జిల్లాలో మొత్తం ఐదు చోట్ల అధికారులు డ్రైరన్ను ప్రారంభించారు. విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), కంకిపాడు మండలం ఉప్పులూరులోని ప్రైమరీ హెల్త్ కేర్ (పీహెచ్సీ), ప్రకాష్ నగర్ లోని అర్బన్ హెల్త్ కేర్ సెంటర్, సూర్యారావుపేటలోని పూర్ణ హార్ట్ ఆస్పత్రి, కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో డ్రైరన్ నిర్వహిస్తున్నారు.
ప్రకాశ్ నగర్ లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఐదు సెంటర్లలో డ్రైరన్ కార్యక్రమం ప్రారంభం అయ్యిందని చెప్పారు. ఒక్కో సెంటర్ లో 25మంది డ్రైరన్ లో పాల్గొంటున్నారని అన్నారు. డ్రైరన్ లో భాగంగా ప్రతి సెంటర్ లో అయిదుగురు సిబ్బంది, మూడు గదులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మొదటి గదిలో రిజిస్ట్రేషన్, రెండో గదిలో వ్యాక్సినేషన్, మూడో గదిలో పరిశీలన ఉంటుందని అన్నారు. ఈ డ్రైరన్ ప్రక్రియ వివరాలను స్టేట్, డిస్టిక్ టాస్క్ ఫొర్స్కి అందజేస్తామని తెలిపారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ డ్రైరన్ లో వ్యాక్సిన్ ఇవ్వడం మినహా, పంపిణీకి సంబంధించి మిగిలిన అన్ని దశలను పరిశీలించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ