ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఇప్పుడు ప్రధాన పార్టీల నాయకులను కలవరపెడుతోంది. జిల్లాల విభజన తరువాత ఈ సెగ్మెంటును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినా కూడా వైఎస్పార్సీపీలో అలాంటి జోష్ ఎక్కడా కనిపించడం లేదు. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా స్థానికంగా ఉన్న సమస్యలను వైసీపీ ఇప్పటి వరకూ పరిష్కరించకపోవడంపై ప్రజలలో పెద్ద ఎత్తున నెగిటివిటీ పెరిగిపోవడమే దీనికి కారణంగా చెబుతారు. ఈ నియోజక వర్గంలో ఇప్పటి వరకు అత్యధికంగా పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు తెలుగు దేశం పార్టీ, ఐదుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయాన్ని సాధించగా, 2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయాన్ని దక్కించుకున్నారు.
టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంవీ నాయుడు 1983లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే 1985 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంవీ నాయుడే రెండోసారి కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లోనూ మతెలుగు దేశం పార్టీ మరోసారి కూడా గెలుపు గుర్రం ఎక్కింది. 1994లో జరిగిన ఎన్నికల్లోనూ అభ్యర్థి మారినా తెలుగు దేశం పార్టీనే విజయం సాధించింది. అలాగే 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుంచి బరిలో దిగిన ఎర్రా అన్నపూర్ణమ్మ విజయాన్ని దక్కించుకున్నారు. 1999లో మాత్రం తెలుగు దేశం పార్టీని కాదని కాంగ్రెస్కు పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు. 2004లో కూడా హస్తం పార్టీనే విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సవరపు జయమణి 2009 ఎన్నికల్లో అక్కడి ఓటర్ల మనసు గెలుచుకున్నారు.
అయితే, రాష్ట్ర విభజన వల్ల 2014 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన బొబ్బిలి చిరంజీవులు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, చిరంజీవులపై ఆరోపణలు రావడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి ఏ జోగారావుకు ఓటర్లు విజయాన్ని కట్టబెట్టారు. అయితే మరికొద్ది రోజుల్లో రానున్న ఎన్నికల్లో..ఈ నియోజకవర్గంలో విజయం దక్కించుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి.టీడీపీ నుంచి బోనెల విజయచంద్రకు సీటు కన్ఫర్మ్ అవగా… వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు నేతలు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇక, రెండు పార్టీల బలాబలాల విషయానికి వస్తే.. వ్యక్తుల బలం కన్నా.. ప్రజల్లో ఉన్న సెంటిమెంటు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. వరుస విజయాలను అందించడం ఈ నియోజకవర్గం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. పార్టీలకు ఉన్న చరిష్మాతో పాటు..తమ నియోజకవర్గంలో లీడర్ అందుబాటులో ఉండడం వంటి కీలక విషయాలను ఇక్కడి ఓటర్లు ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు. సెంటిమెంట్ ప్రకారం వైసీపీ గెలవాల్సి ఉండగా..పార్వతీ పురాన్ని జిల్లా కేంద్రంగా చేసినప్పటికీ.. రవాణా సదుపాయం వంటివి కల్పించకపోవడం వైసీపీకి మైనస్గా మారిందన్న వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.మరి ఇక్కడి ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుతారో చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE