గులాబ్ తుపాను బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయని, నామమాత్రపు సాయంతో సరిపెట్టవద్దని, రైతులు, కౌలు రైతులు కోలుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. “గులాబ్ తుపాను సృష్టించిన బీభత్సం, భారీ వర్షాల వల్ల ఉత్తరాంధ్ర నుంచి, కృష్ణా జిల్లా వరకూ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి. వేలాది ఇళ్ళల్లోకి నీళ్ళు ప్రవేశించి జనజీవనం అస్తవ్యస్తం కావడం బాధాకరం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం దెబ్బతినడంతో ప్రజలు అంధకారంలో ఉన్నారు. వీలైనంత త్వరగా విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను పునరుద్ధరించాలని సంబంధిత శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నాం” అని అన్నారు.
“జనసేన నాయకులు, శ్రేణులు తమ పరిధిలో బాధితులకు సహాయపడాలని కోరుతున్నాను. ప్రకృతి విపత్తులకు నష్టపోయే వర్గం రైతాంగమే. అప్పులు చేసి, కాయకష్టంతో సాగు చేసే రైతులు తుపాన్లు, భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బ తింటున్నారు. గులాబ్ తుపాను మూలంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఎక్కువ మేర వరి దెబ్బతింది. పంట నష్ట పరిహారం లెక్కించడంలో ప్రభుత్వం అనుసరించే విధానాలు మారితేనే రైతులకు మేలు జరుగుతుంది. నామ మాత్రపు సాయంతో సరిపెడితే ప్రయోజనం ఉండదు. నివర్ తుపాను సమయంలో పంటలు దెబ్బ తిన్న ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతులు, కౌలు రైతుల ఆవేదన స్వయంగా తెలుసుకున్నాను. ఎకరానికి రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకూ పరిహారం ఇస్తేనే రైతులు కోలుకోగలరు. ఈ దిశగా ఇప్పుడైనా ఆలోచన చేయాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ