టీడీపీ, జనసేన కూటమి తొలి ఉమ్మడి జాబితా రిలీజయిన తర్వాత రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. జనసేన పోటీ చేయబోయే మూడు లోక్ సభ స్థానాల్లో అనకాపల్లి నియోజకవర్గం కూడా ఉందనే వార్తలు రావడంతో..ఇన్ని రోజులు ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న పారిశ్రామిక వేత్త బైరా దిలీప్ చక్రవర్తి తాజాగా చోడవరం అసెంబ్లీ గురించి ఆరా తీస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టీడీపీ,జనసేనల పొత్తు కుదుర్చుకోవడంతో..రెండిటిలో ఏదొక పార్టీ నుంచి అనకాపల్లి లోక్సభకు పోటీ చేయడానికి దిలీప్ ఆరు నెలలుగా నియోజక వర్గంలోనే పర్యటిస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్కు, మరోవైపు నారా లోకేష్కు సన్నిహితంగా మెలుగుతూ పార్టీ కార్యక్రమాలతో పాటు.. సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం తరపున గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి బరిలో దిగి ఓడిపోయిన దిలీప్ చక్రవర్తి.. కాపు సామాజిక వర్గానికి అనకాపల్లి అనుకూలం అనే అంచనాలతో ఆ నియోజకవర్గంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. నాగబాబు అనకాపల్లి లోక్సభకు పోటీ చేయడానికి తన ప్రయత్నాలు ప్రారంభించడంతో దిలీప్కు లోక్సభకు పోటీ చేసే అవకాశాలు దెబ్బతిన్నాయి. దీంతో అనకాపల్లి జిల్లాలో కాపులకు అనుకూలమైన మరో అసెంబ్లీ నియోజక వర్గమైన చోడవరం సీటుపై దృష్టి సారించారు. 2019 ఎన్నికలలో వైసీపీ తరపున కరణం ధర్మశ్రీ విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆయన మితిమీరిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల వల్ల ధర్మశ్రీ..కాదు అధర్మశ్రీ అని పేరుబడ్డారంటూ స్థానికులు సెటైర్లు వేసుకునే స్థాయికి దిగజారిపోయారు.
2009, 2014 ఎన్నికలలో టీడీపీ నుంచి ఎన్నికైన కేఎస్ఎన్ఎస్ రాజు 2019లో ఓడిపోవడంతో..ఆ ఓటమిని జీర్జించుకోలేక కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజు స్థానంలో వడ్డాదికి చెందిన తాతయ్యబాబును టీడీపీ ఇన్చార్జిగా నియమించింది.అయితే కొన్నాళ్లుగా వైసీపీకి పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన రాజు.. ఇటీవల రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుతూ వస్తున్నారు.
అయితే టీడీపీ నుంచి కాకుండా జనసేన నుంచి రాజు.. చోడవరం నియోజక వర్గంలో చురుగ్గా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. చోడవరం సెగ్మెంట్ సమస్యలపై పాదయాత్ర చేయడంతో పాటు..చాలా చర్చావేదికలు కూడా నిర్వహించి నియోజకవర్గంలో జనసేనను బలమైన పార్టీగా తయారు చేస్తూ వస్తున్నారు. దీంతో ఇటు రాజును, అటు టీడీపీ ఇన్చార్జి తాతయ్యబాబును కాదని దిలీప్ చక్రవర్తికి టికెట్ ఇస్తారా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ధర్మశ్రీపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆ నియోజక వర్గంలో ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే నిలబడితే చాలు.. విజయం నల్లేరు మీద నడకే అవుతుందన్న అభిప్రాయం అక్కడ వ్యక్తమౌతోంది. మరి మారిన రాజకీయ సమీకరణాల మధ్య అనకాపల్లి, చోడవరం నియోజకవర్గంలో ఎవరికి సీటు వస్తుందా అన్న ఆసక్తి అక్కడ నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE