విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కానక దుర్గమ్మ సన్నిధిలో సెప్టెంబరు 26 నుంచి 10 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపైన ఆలయానికి వచ్చే అన్ని మార్గాల్లో ఏర్పాట్లను సీపీ కాంతి రాణా మరియు కలెక్టరు ఢిల్లీ రావుతో కలిసి ఆయన పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దసరా ఉత్సవాలు నిర్వహిస్తామని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
సమీక్ష అధికారులకు కీలక సూచనలిచ్చిన మంత్రి కొట్టు సత్యనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిపై తగినంతమంది సిబ్బంది లేకపోయినా టీటీడీకి మించిన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. భవానీ భక్తుల కోసం టీటీడీ స్థలంలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే వృద్ధులు మరియు వికలాంగులకు అమ్మవారి దర్శనం కోసం కొండపైకి బ్యాటరీ వెహికల్స్ అనుమతిస్తామని తెలిపారు. ఇక వీఐపీల ప్రత్యేక దర్శనాలకు ఆన్లైన్లో స్లాట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనిలో భాగంగా ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ప్రకారం 10 లెటర్స్ మరియు బ్రేక్ దర్శనానికి ఐదుగురికి అనుమతిస్తామని వెల్లడించారు. అలాగే బ్రేక్ దర్శనాల కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామని, లోకల్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పరిధి పెంచుతామని వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ