ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. ఇటీవల ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల పనులు లేక ఆత్మహత్యకు పాల్పడడంతో ఇసుక కొరత సమస్యపై టీడీపీ పార్టీ తన పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్టోబర్ 30, బుధవారం నాడు గుంటూరు కలెక్టరేట్ ముందు నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు లోకేష్ దీక్ష చేయనున్నారు. రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని విమర్శించారు. ఒక పక్క కార్మికులు పనుల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమస్యపై సమీక్ష నిర్వహించి వారిని ఆదుకోవడం లేదని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులకు టీడీపీ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో లోకేష్ కి సంఘీభావంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు, టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
మరో వైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబరు 3న విశాఖలో లాంగ్ మార్చ్ చేపట్టాలని నిర్ణయించారు. కార్మికుల పరిస్థితి దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు ఈ లాంగ్ మార్చ్ కు మద్దతివ్వాలని కోరారు. ఇక అక్టోబర్ 29, మంగళవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇసుక తవ్వకాలు, పంపిణీ పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. వరదలు తగ్గగానే వారం రోజులపాటు ఇసుక సరఫరాపైనే దృష్టి సారించి, రాష్ట్రంలో ఇసుక కొరతపై ఇక ఎవరూ మాట్లాడకుండా ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
[subscribe]