ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే జాబితాల వారీగా వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు. మరికొద్దిరోజుల్లోనే పూర్తిస్థాయి జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈసారి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం-జనసేన పార్టీలు కూడా సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఎంపికపై వర్కౌట్ చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థులను ఢీ కొట్టేందుకు ఆచితూచి సమర్థవంతమైన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.
ఇప్పటికే పొత్తు కారణంగా పోటీ చేయబోయే స్థానాలకు సంబంధించి జనసేన-తెలుగు దేశం పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో నూజివీడు తెలుగు దేశం పార్టీకి దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థానం నుంచి తెలుగు దేశం తరుపున ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈక్రమంలో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటీవల పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పెనమలూరు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరించడంతో రాజీనామా చేశారు. త్వరలో ఆయన తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఈక్రమంలో నూజివీడు నుంచి కొలుసు పార్థసారధిని బరిలోకి దించాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోందట. ఈయనతో పాటు 2014, 2019 ఎన్నికల్లో నూజివీడు నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు, ఎన్నారై పర్వతనేని గంగాధర్ పేర్లు కూడా వినపడుతున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో నూజివీడు నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావు పోటీ చేసి రెండుసార్లు ఓటమిపాలయ్యారు. ఈక్రమంలో ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నూజివీడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఉన్నారు. 2014లో ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నూజివీడు నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొంది రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈక్రమంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా అప్పారావునే అక్కడి నుంచి పోటీ చేయించాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట.
ఈక్రమంలో వెంకట ప్రతాప్ అప్పారావును ఢీ కొట్టేందుకు బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తోన్న టీడీపీ.. అందుకు కొలుసు పార్థసారథి అయితేనే కరెక్ట్ అని భావిస్తోందట. అందుకే ఆయన్ను నూజివీడు నుంచి పోటీ చేయించాలని భావిస్తోందట. అంతాకాకుండా నూజివీడులో అత్యధికంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అటు పార్థసారధి కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ హైకమాండ్ భావిస్తోందట. అయితే పార్థసారధి మాత్రం నూజివీడు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆయనకు పెనమలూరు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. చివరికి పార్థసారధి వినకపోతే నూజివీడు నుంచి ఎన్నారై పర్వతనేని గంగాధర్ను బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY