ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. మొత్తం 7 సీట్లను కైవసం చేసుకోగలమని ధీమాగా ఉన్న ఆ పార్టీకి ప్రతిపక్ష టీడీపీ గట్టి షాక్ నే ఇచ్చింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా 23 ఓట్లు దక్కించుకుని ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో లోపం ఎక్కడ ఉందో విశ్లేషించుకుంటామన్న ఆయన ఈ ఎన్నికలకు విప్ వర్తించదని, ఒకవేళ ఆ అవకాశం ఉండి ఉంటే బావుండేదని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ ఫలితాల అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమకు అభ్యర్థులను గెలిపించుకోవడానికి తగిన సంఖ్యాబలం ఉందనే మొత్తం ఏడు సీట్లకు పోటీ పెట్టామని, తమతో విభేదించిన నెల్లూరు రూరల్ మరియు వెంకటగిరి ఎమ్మెల్యేలను అసలు తాము పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. అయితే టీడీపీ తరపున గెలిచి అనంతరం బయటకు వచ్చిన 4గురు ఎమ్మెల్యేలు మరియు జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తమ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని, అందుకే ఏడో సీటుకు కూడా పోటీ పెట్టామని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రలోభ పెట్టారని ఆరోపించిన సజ్జల, ఈ విషయంలో ఆయనతో వైసీపీ కానీ, సీఎం జగన్ కానీ పోటీ పడలేమని ఎద్దేవా చేశారు. ఇక తమ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని అనుకోవట్లేదని, ఒకవేళ ఎవరైనా అలా భావిస్తుంటే వారిని పిలిచి మాట్లాడుతామని తెలిపారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అనేది గుర్తించామని, బాధ్యలు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని, సరైన సమయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE