ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. టీడీపీ,జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్, కాంగ్రెస్ అధినేత్రి షర్మిలకు తోడు ఎంపీ రఘురామకృష్ణం రాజు, తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ఇలా చెప్పుకుంటూ పోతే వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి.. ఇలా చాలా మంది వైసీపీ ప్రభుత్వంపైనా, జగన్ పైనా బాణాలు విసురుతున్నారు. వారి ప్రకటనలు, ప్రచారాలు పరిశీలిస్తే.. వైసీపీకి నిజంగానే ఓటమి తప్పదా అనే చర్చలు మొదలవుతున్నాయి. గెలుపోటముల సంగతి అటుంచితే.. గత ఎన్నికల్లో 151 సీట్ల బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందన్న సంచలన కామెంట్లూ వినిపిస్తున్నాయి.
వైసీపీ నుంచే ఎంపీగా గెలిచినప్పటికీ.. స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరించే రఘురామకృష్ణంరాజు మొదటి నుంచీ ఆ పార్టీకి కొరకరానికొయ్యగానే మారారు. ఇప్పుడు తాజాగా మరోసారి సంచలన వాఖ్యలు చేశారు. ‘వ్యూహం’ సినిమా కలెక్షన్లలాగే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు అంతే ఘోరంగా వస్తాయని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. వ్యూహం సినిమా కంటే ఘోరమైన పరాభవాన్ని వైసీపీ చూడబోతుందన్నారు. వాస్తవానికి రాయలసీమలో 20- 25 స్థానాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 15 కలుపుకొని మొత్తంగా వైసీపీకి 40 స్థానాలు వస్తాయని ఇన్నాళ్లూ భావించామని, కానీ ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే ఆ పార్టీ సింగల్ డిజిట్కు పరిమితమైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని చెప్పారు. ఓటమిని తట్టుకోవడానికి వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఓటమి తర్వాత చేపట్టబోయే ఓదార్పు యాత్రకు జగన్ మనోధైర్యం తెచ్చుకోవాలని హితబోధ చేశారు.
పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి అభిమన్యుడిని కాదని, అర్జున్ రెడ్డిని అని చెప్పుకునే జగన్… తన వ్యూహంలో తానే చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఎద్దేవా చేశారు. రామ్గోపాల్వర్మ పన్నిన వ్యూహం నుంచే జగన్ బయటకు రాలేదని, ఇక పద్మవ్యూహం నుంచి బయటకేం వస్తారంటూ అపహాస్యం చేశారు. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టిన పాలకులు, రేపు ప్రజల ఆస్తులు కూడా తాకట్టు పెట్టే ప్రమాదం లేకపోలేదని రఘురామరాజు అన్నారు. ఇప్పటికే ప్రజల వ్యక్తిగత ఆస్తి పత్రాలను పాలకులు తమవద్దే ఉంచుకున్నారని, ఏదైనా బ్యాంకు వచ్చి అప్పు ఇస్తామంటే, వాటిని కూడా తాకట్టు పెడతారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఎవరిని ఉంచాలి, ఎవర్ని ఇంటికి పంపాలో ప్రజలు ఆలోచించాలని కోరారు.
ఐదేళ్లలోని వైసీపీ చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలు మరచిపోయేలా.. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ వైసీపీపై విపక్షం చేస్తున్న ప్రచారం బాగా పాపులర్ అవుతోంది. వీటిని తిప్పికొట్టేందుకు జగన్ ఎంత కష్టపడుతున్నా, చేసిన మంచికన్నా, అక్కడక్కడా జరిగిన పొరపాట్లే పైకి కనిపించేలా విపక్షం అనుసరిస్తున్న వ్యూహంతో ఆ పార్టీకి కష్టాలు తప్పేలా లేవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. అసలైన ప్రచారం మొదలుకాలేదు. ఈక్రమంలో రాజకీయాలు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయే అనే ఉత్కంఠ ఏర్పడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE