గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన తాడికొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్పై విజయం సాధించారు. అయితే గత వినాయక చవితి సందర్భంగా వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్ళినపుడు జరిగిన ఒక సంఘటన గురించి వివరిస్తూ తన సామాజిక వర్గ ప్రస్తావన తేవడంతో వివాదం మొదలయింది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాను క్రిస్టియన్ అని చెప్పిందని, ఆమెకు ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత లేదని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోష్ అనే వ్యక్తి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం, ఈ అంశంపై విచారించాలని ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీదేవి రిజర్వేషన్ పై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరింది. ఈ క్రమంలో నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని ఎమ్మెల్యే శ్రీదేవిని, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. తన రిజర్వేషన్ ఎస్సీ అని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలు, సంబంధిత పత్రాలు తీసుకురావాలని ఆయన సూచించారు.
[subscribe]