తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణంరాజు మధుమేహంతో పాటు పోస్ట్ కోవిడ్ సమస్యల ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మరణించారు. ఈ మేరకు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. కాగా కృష్ణంరాజు కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని, రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఆయన కాలుకు గతేడాది శస్త్రచికిత్స జరిగిందని వారు తెలిపారు. ఇక కోవిడ్ అనంతర సమస్యలతో ఆగస్టు 5న ఆస్పత్రిలో చేరారని, మల్టీడ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల్లో తీవ్ర నిమోనియా సోకిందని వెల్లడించారు. దీనివలన కిడ్నీ పూర్తిగా దెబ్బతినడంతో గత నెలరోజులుగా వెంటిలేటర్పై చికిత్స అందించామని, ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారని ఏఐజీ వైద్యులు తెలిపారు. కృష్ణంరాజుకు భార్యా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రేపు ఉదయం హైదరాబాద్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు మృతిపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
రెబల్ స్టార్ సినీ రంగ ప్రవేశం..
కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో విజయనరగ సామ్రాజ్య క్షత్రియుల వంశస్థుల కుటుంబంలో 1940, జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా పనిచేసిన ఆయన నటనపై మక్కువతో మద్రాస్ చేరుకొని ప్రయత్నాలు ప్రారంభించారు. శోభన్బాబు, కృష్ణ సినిమాల్లోకి వచ్చిన కొద్దిరోజులకే కృష్ణంరాజు 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. అనంతరం విలన్ పాత్రలు వేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి పర్సనాలిటీ ఉండటంతో నిర్మాతలు ఆయనను హీరోగా పెట్టి సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపించారు. ఈ క్రమంలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న కృష్ణంరాజు 180కి పైగా చిత్రాల్లో నటించి తనదైన నటనతో తెలుగు చిత్రసీమలో రెబల్ స్టార్గా పేరొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, త్రిశూలం, అమరదీపం, తాండ్రపాపారాయుడు, కురుక్షేత్రం, కృష్ణవేణి, కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, మా నాన్నకి పెళ్లి, చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
ఇక కృష్ణంరాజు తన నటనతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. 1977లో ఆయన హీరోగా వచ్చిన అమరదీపం, 1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు అందుకున్నారు. అలాగే 1986లో తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక 2006లో ఫిల్మ్ఫేర్ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో నటుడిగా కొనసాగిన ఆయన చివరి చిత్రం తన నట వారసుడు ప్రముఖ టాలీవుడ్ అగ్ర హీరో, బాహుబలి ఫేమ్ ‘ప్రభాస్’ హీరోగా వచ్చిన ‘రాధేశ్యామ్’. కాగా ప్రభాస్ కృష్ణంరాజు సోదరుడి కుమారుడు అన్న సంగతి తెలిసిందే. కృష్ణంరాజు వారసుడిగా సినీ పరిశ్రమల్లో అడుగుపెట్టిన ప్రభాస్ బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రభాస్ తో కలిసి 3 చిత్రాల్లో నటించారు. బిల్లా, రెబెల్, చివరిగా రాధేశ్యామ్ చిత్రాల్లో వారు కలిసి నటించి అభిమానులను అలరించారు. అయితే ప్రభాస్ వివాహం చూడాలన్న తన చివరి కోరిక నెరవేకుండానే ఆయన వెళ్లిపోయారు.
రాజకీయాల్లో కూడా రాణించిన కృష్ణం రాజు..
కృష్ణంరాజు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన తొలుత 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 1998 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించి తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. ఇక 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో మరోసారి నర్సాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొంది రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి హయాంలో కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే 2004లో జరిగిన ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీచేసి ఆయన ఓడిపోయారు. ఇక 2009 ఎన్నికలకు ముందు కృష్ణంరాజు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్కుమార్ చేతిలో ఓడిపోయారు. అనంతరం తిరిగి ఆయన బీజేపీలో చేరారు. అయితే వయస్సు రీత్యా ప్రత్యక్ష రాజకీయాలకు కొంచెం రాజకీయాలకు దూరంగా ఉంటున్నా బీజేపీ పార్టీతో సాన్నిహిత్యాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు కృష్ణంరాజు. కాగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కృష్ణంరాజును బాగా గౌరవిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY