ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తం 10 వేల పేజీలతో రూపొందించిన చార్జిషీట్లో నిందితులుగా ఏడుగురి పేర్లను చేర్చింది. అయితే తొలినుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ హోంమంత్రి మనీష్ సిసోడియాకు మినహాయింపు ఇవ్వడం గమనార్హం. ఆయనతో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్న ‘అరబిందో’ డైరక్టర్ శరత్ చంద్రారెడ్డి పేరు కూడా లేకపోవడం విశేషం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసింది, సీబీఐ కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులపై ఐపిసి సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర) మరియు లంచం కోసం అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం అభియోగాలు మోపారు.
కాగా చార్జిషీట్లో పేర్కొన్న ఏడుగురిలో ఇద్దరు ప్రభుత్వ అధికారులు కాగా, మిగిలిన అయిదుగురు ప్రైవేటు వ్యక్తులు. ఈ ఏడుగురిలో అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్ మరియు అరుణ్ రామచంద్ర పిళ్లైలకు తెలుగు రాష్ట్రాలతో లింకులున్నాయి. వీరిలో అభిషేక్ అనూస్ బ్యూటీ పార్లర్స్ నిర్వహిస్తుండగా, రామచంద్ర పిళ్లై మద్యం సహా పలు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. ఇక ముత్తా గౌతమ్ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ యజమాని అన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు చేయడంతో కేంద్ర సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాలలో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించిన అనంతరం శుక్రవారం సీబీఐ మొదటి చార్జిషీట్ ఫైల్ చేసింది. మరోవైపు ఈడీ కూడా త్వరలోనే తొలి చార్జిషీట్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందు ముందు విచారణలో ఇంకెన్ని పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE