కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇప్పట్లో పాఠశాలలు ప్రారంభించవద్దని నిర్ణయించినట్టు బుధవారం నాడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు మూసివేసే ఉంటాయని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని చాలా మంది తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఇప్పుడే పాఠశాలలను తిరిగి తెరవవద్దని సూచించారని చెప్పారు. వందల మంది విద్యార్థులు పాఠశాలలకు రావడం ప్రారంభిస్తే, పిల్లలకు కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, పాఠశాలలు ప్రారంభించిన దేశాల్లో కేసులు పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయని అన్నారు. దీంతో పాఠశాలల ప్రారంభంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 విడుదల చేసిన అన్లాక్ 5.0 మార్గదర్శకాలలో అక్టోబర్ 15 నుంచి కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల పాఠశాలలు ప్రారంభించేందుకు రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఇచ్చింది. విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేందుకు తల్లిదండ్రుల వ్రాతపూర్వక అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. తాజాగా అన్లాక్ 5.0 మార్గదర్శకాలనే నవంబర్ 30 కొనసాగించాలని కేంద్ర హోమ్ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాలు నవంబర్ లో పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అవుతుండగా, ఢిల్లీ ప్రభుత్వం మాత్రం పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో మరి కొన్ని రోజులు పాఠశాలల మూసివేతకే నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్: