100 టెస్టులు ఆడిన 12వ భారత క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్ లో 100వ టెస్ట్ మ్యాచ్ని స్మరించుకుంటూ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కోహ్లీని శుక్రవారం సత్కరించింది. ఆట ప్రారంభానికి ముందు భారత మాజీ కెప్టెన్ మరియు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లీకి ప్రత్యేక టెస్ట్ క్యాప్తో సత్కరించారు. అయితే, విరాట్ కోహ్లీ తన 100వ టెస్ట్ మ్యాచ్లో 8000 టెస్ట్ పరుగులను పూర్తిచేసుకోవడం విశేషం. టెస్టు క్రికెట్లో 8000 పరుగులకు చేరుకోవడానికి విరాట్ కోహ్లీ 169 ఇన్నింగ్స్లు ఆడాడు. ఇప్పటివరకు 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు సాధించాడు.
38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ రికార్డు ప్రదర్శన ద్వారా కోహ్లీ.. గవాస్కర్, సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్ వంటి భారత దిగ్గజాల సరసన నిలిచాడు. అయితే, 45 పరుగులు చేసిన అనంతరం విరాట్ ఔటయ్యాడు. 100వ టెస్టులో సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో హాఫ్ సెంచరీ ముంగిట కోహ్లీ అవుట్ కావడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్దం ఆవరించుకుంది. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ 97 బంతుల్లో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీని కోల్పోయాడు. తొమ్మిది ఫోర్లు మరియు నాలుగు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. తొలుత మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) శుభారంభం అందించారు. అనంతరం హాఫ్ సెంచరీతో హనుమ విహారి సత్తా చాటాడు. విరాట్ కోహ్లి 45 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి తోడుగా రవిచంద్రన్ అశ్విన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా, లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దేనియా రెండు వికెట్లు తీశాడు. సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార, ధనంజయ డిసిల్వా ఒక్కో వికెట్ తీశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ