భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఫిబ్రవరి 28, ఆదివారం ఉదయం 10.24 గంటలకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ51 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ ప్రయోగానికి శనివారం ఉదయం 8:54 గంటలకు కౌంట్డౌన్ మొదలుపెట్టారు. 25.30 గంటల కౌంట్డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 10:24 గంటలకు ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా బ్రెజిల్ కు చెందిన అమెజోనియా-1 ఉపగ్రహంతో పాటుగా మన దేశానికి చెందిన 18 (12 స్పేస్ బీస్, నానో కాంటాక్ట్–2, సింధునేత్ర, సతీశ్ ధావన్ శాట్, యూనిటీశాట్ 3 ఉపగ్రహాలు) ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ కే.శివన్ ప్రకటించారు. పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ మోసుకెళ్లిన అమెజోనియా-1 ఉపగ్రహన్నీ, అలాగే మిగతా 18 ఉపగ్రహాలు కూడా నిర్ణీత కక్ష్యలోకి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం అయిందని, ఈ ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు కే.శివన్ అభినందనలు తెలియజేశారు.
పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) యొక్క 53 వ మిషన్ అయిన పీఎస్ఎల్వీ-సీ51/అమెజోనియా-1 అనేది ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) యొక్క మొట్టమొదటి కమర్షియల్ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపిన అమెజోనియా-1 ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం ద్వారా అమెజాన్ ప్రాంతంలో అటవీ నిర్మూలన పర్యవేక్షణ మరియు బ్రెజిలియన్ భూభాగంలో వ్యవసాయం విశ్లేషణపై రిమోట్ సెన్సింగ్ డేటాను సేకరించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ