దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 578 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి, మళ్ళీ కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ సహా ఆంక్షలు విధిస్తుండగా, ఆ జాబితాలోకి తాజాగా కర్ణాటక, ఢిల్లీ కూడా చేరాయి. ఢిల్లీలో డిసెంబర్ 27వ తేదీ నుంచి రాత్రి 11.00 గంటల నుండి ఉదయం 5.00 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు మరియు సమావేశాలపై కూడా ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా డిసెంబర్ 28వ తేదీ నుండి రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 10 రోజుల పాటుగా నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఆదివారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా కేసుల పెరుగుదలపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె సుధాకర్ నైట్ కర్ఫ్యూ విధింపుపై ప్రకటన చేశారు. అలాగే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పార్టీలు మరియు సమావేశాలపై కొన్ని ఆంక్షలు ఉంటాయని తెలిపారు. హోటల్స్, పబ్స్, బార్స్, రెస్టారెంట్స్ లో సామర్ధ్యాలను అనుగుణంగా కేవలం 50 శాతం సిటింగ్ కెపాసిటీకే అనుమతి ఉంటుందన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా థియేటర్స్ లో కూడా ప్రదర్శనలను రాత్రి 10 గంటలకు ముగించాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ