పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. లోక్సభ, రాజ్యసభలు షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14న ప్రారంభం కాగా, ఏప్రిల్ 8 వరకు జరగాల్సి ఉండగా ఒకరోజే ముందుగానే వాయిదా పడ్డాయి. మరోవైపు మొదటి విడత బడ్జెట్ సెషన్ జనవరి 31న ప్రారంభం కాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఫిబ్రవరి 11న ముగిసిన సంగతి తెలిసిందే. సమావేశాల ముగింపు సందర్భంగా లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, మొత్తం 27 సిట్టింగ్స్ లో 177 గంటల 50 నిమిషాల పాటు సమావేశాలు జరిగినట్లు తెలిపారు. అలాగే ఈ సెషన్లో సభ 129 శాతం ప్రొడక్టివిటీని నమోదు చేసిందని చెప్పారు. ఈ సమావేశాల్లో 2022-23 బడ్జెట్ తో పాటు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు మరియు క్రిమినల్ ప్రొసీజర్ (గుర్తింపు) బిల్లు వంటి కీలక బిల్లులు ఆమోదించబడ్డాయి.
మరోవైపు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడు ఎలాంటి ముగింపు వ్యాఖ్యలు చేయకుండానే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలో సభ వాయిదాపై ఛైర్మన్ ముగింపు వ్యాఖ్యలు చేయబోతుండగా శివసేన సభ్యులు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ విషయంలో ప్రజల నుంచి సేకరించిన విరాళాలను స్వాహా చేశారన్న ఆరోపణలపై నమోదైన ఎఫ్ఐఆర్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించి, వెల్లోకి వచ్చారు. కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా మద్దతుగా వచ్చి ఈ వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సభ్యులను తమ స్థానాల్లోకి వెళ్లాలని చైర్మన్ కోరినప్పటికీ వారు తమ నిరసనను కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే సభను నిరవధికంగా వాయిదా వేస్తునట్టుగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ