దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మరియు ఆరోగ్య మంత్రులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం మోదీ మాట్లాడుతూ, సమర్థవంతమైన టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానంపై రాష్ట్రాలు దృష్టి సారించాలని చెప్పారు. ప్రజలు మాస్కులు ధరించడాన్ని అలవాటు చేసుకోవడం చాలా కష్టం అవ్వచ్చు కాని, మాస్కు ధరించడం మన రోజువారీ జీవితంలో ఓ భాగంగా చేసుకోకపోతే కరోనాపై పోరాటంలో ఆశించిన ఫలితాలను పొందలేమని అన్నారు.
దేశంలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయన్నది నిజం. కానీ దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 10 లక్షలకు పైగా పరీక్షలు చేస్తున్నాం, అలాగే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలో ఉత్తమ పద్ధతులు పాటించడం వలన ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. కరోనా స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డిఆర్ఎఫ్) వాడకంపై చాలా రాష్ట్రాలు అభ్యర్థించడంతో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎస్డిఆర్ఎఫ్ వాడకం పరిమితిని 35 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో, కరోనాతో పోరాడేందుకు రాష్ట్రాలకు ఎక్కువ డబ్బు లభిస్తుందని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే అంశాన్ని అన్ని రాష్ట్రాలు తీవ్రంగా ఆలోచించాలని ప్రధాని మోదీ కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu