మాజీ ప్రధాని షింజో అబేకు జపాన్ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల/తుది వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. టోక్యోలోని నిప్పాన్ బుడోకాన్ హాల్లో నేడు (సెప్టెంబర్ 27, మంగళవారం) జరుగుతున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అధికారిక వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఉంచి షింజో అబేకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. జూలై 8న పశ్చిమ జపాన్లోని నరా నగరంలో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షింజో అబేపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. జూలైలో అతని కుటుంబ సభ్యులు ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే జపాన్ కు విశేషమైన సేవలు అందించిన షింజో అబే వంటి గొప్ప నేతకు ప్రభుత్వ లాంఛనాలతో అధికారిక వీడ్కోలు పలకాలని ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిడా నేతృత్వంలో జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1967లో మాజీ ప్రధాని షిగెరు యోషిదా తరువాత జపాన్ లో మళ్ళీ మాజీ ప్రధానికి అధికారికంగా నిర్వహిస్తున్న వీడ్కోలు కార్యక్రమం ఇదే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సహా పలు ప్రపంచ దేశాల నాయకులు, వందలాది దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం దృష్ట్యా జపాన్ రాజధాని టోక్యోలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జపాన్లోని టోక్యోకు బయలుదేరే ముందు సోమవారం రాత్రి ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, షింజో అబేతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “భారతదేశం-జపాన్ స్నేహానికి గొప్ప ఛాంపియన్, ప్రియమైన స్నేహితుడు అయిన మాజీ ప్రధాని షింజో అబే అధికారిక అంత్యక్రియల్లో పాల్గొనడానికి నేను ఈ రాత్రి టోక్యోకు ప్రయాణిస్తున్నాను. భారతీయులందరి తరపున నేను ప్రధానమంత్రి కిషిడామరియు శ్రీమతి అబేలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అబే సాన్ ఊహించిన విధంగా భారతదేశం-జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మేము కృషి చేస్తూనే ఉంటాము” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY