భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో రెండు రోజుల పాటుగా (జనవరి 16, 17) జరగనున్నాయి. సోమవారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా సోమవారం మధ్యాహ్నం జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు, జాతీయ, రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత బీజేపీ పార్టీ తొలిసారిగా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై కీలకంగా చర్చించనున్నారు. అలాగే జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ వ్యవహారాలపై మూడు తీర్మానాలు ప్రవేశపెట్టబోతునట్టు తెలుస్తుంది.
కాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ముందు ప్రధాని మోదీ ఢిల్లీలో భారీ రోడ్ షో నిర్వహించారు. పటేల్ చౌక్ నుండి ప్రారంభమైన ప్రధాని రోడ్ షో, సంసద్ మార్గ్ లోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ వరకు కొనసాగింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, ఎస్ జైశంకర్లతో సహా పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా ఈ రోడ్ షోకు హాజరయ్యారు. న్యూఢిల్లీలో రోడ్ షో సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. డప్పులు వాయిస్తూ, కళా ప్రదర్శనలతో దారిపొడవునా పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోదీ ముందుకు సాగారు. మరోవైపు మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ కీలక ప్రసంగంతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE