అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21, సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో యోగా విశిష్టత గురించి ప్రధాని మోదీ వివరించారు. ఈ సందర్భంగా ప్రతి దేశం, సమాజం మరియు వ్యక్తుల ఆరోగ్యం కోసం ప్రార్థిస్తునట్టు చెప్పారు. ఈ ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ ను “యోగా ఫర్ వెల్ నెస్” గా నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా లాంటి కష్ట సమయంలో యోగా ప్రజలకు మూల బలాన్ని, సమతుల్యతను నిరూపించిందని అన్నారు.
కరోనా మహమ్మారితో పోరాడటానికి యోగా ప్రజలకు సహాయపడింది:
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో పోరాడటానికి విశ్వాసం మరియు శక్తిని సేకరించడానికి యోగా ప్రజలకు సహాయపడిందన్నారు. ఫ్రంట్లైన్ కరోనా యోధులు యోగాను కవచంగా ఎలా చేసుకుని, తమకు తాము ఎలా బలంగా మారారు, రోగులకు ఎలా సహాయపడ్డారు, యోగా ద్వారా మరియు వైరస్ యొక్క ప్రభావాలను ఎదుర్కోవటానికి ప్రజలు, వైద్యులు, నర్సులు యోగాను ఎలా అనుసరించారో ప్రధాని గుర్తు చేశారు. శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రాణాయామం, అనులోమ్-విలోమ్ వంటి శ్వాస వ్యాయామాల ప్రాముఖ్యతను నిపుణులు నొక్కి చెబుతున్నారని అన్నారు. భారతదేశం ఎన్నో యుగాల నుండి అనుసరిస్తున్న ‘వసుధైక కుటుంబం’ మంత్రం ఇప్పుడు ప్రపంచ ఆమోదాన్ని పొందుతోందని ప్రధాని అన్నారు. ఆన్లైన్ తరగతుల సమయంలో పిల్లలు యోగా చేయడాన్ని ప్రధాని గుర్తించారు. ఈ విధానం కరోనాతో పోరాడటానికి పిల్లలను సిద్ధం చేస్తోందని చెప్పారు.
యోగా శిక్షణ యొక్క అనేక వీడియోలను అందించే ఎం-యోగా యాప్:
యోగా దినోత్సవం సందర్భంగా భారత్, డబ్ల్యూహెచ్ఓ మరో ముఖ్యమైన అడుగు వేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అనేక భాషలలో సాధారణ యోగా ప్రోటోకాల్ ఆధారంగా యోగా శిక్షణ యొక్క అనేక వీడియోలను అందించే ఎం-యోగా యాప్ ను ప్రపంచం ముందుకు తీసుకువస్తునట్టు చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రాచీన విజ్ఞాన కలయికకు ఇది ఒక గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. యోగా ప్రపంచాన్ని వ్యాప్తి చేయడానికి ఎం-యోగా యాప్ సహాయపడుతుందని మరియు ‘వన్ వరల్డ్-వన్ హెల్త్’ ప్రయత్నాలకు దోహదపడుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ