కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అన్లాక్-4 మార్గదర్శకాలలో సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, విద్యా సంస్థలు, మరియు కోచింగ్ సంస్థలు తెరవడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 21 నుంచి కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల 9 నుండి 12 తరగతుల విద్యార్థులు తమ పాఠశాలకు ఉపాధ్యాయుల సూచనలతో, స్వచ్ఛంద ప్రాతిపదికన వెళ్లొచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు/సంరక్షకుల రాత పూర్వక అంగీకార పత్రం తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21 నుంచి 9 నుండి 12 తరగతుల విద్యార్థులు పాఠశాలలు, కాలేజిలకు వెళ్లే క్రమంలో పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. విద్యాసంస్థలు, విద్యార్థులు పాటించాల్సిన పలు మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది.
సాధారణ నివారణ చర్యలు:
- ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సాధ్యమైనంతవరకు 6 అడుగుల భౌతిక దూరం అనుసరించాలి.
- పాఠశాల ప్రాంగణంలో ఉన్నప్పుడు ఫేస్ మాస్క్లు మరియు ఫేస్ కవర్లు తప్పనిసరిగా ధరించాలి.
- సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి.
- దగ్గు లేదా తుమ్ము వచ్చినపుడు ఇతరుల దృష్ట్యా ముక్కు, నోరు కవర్ చేసుకునే నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.
- ఆరోగ్యంపై స్వీయ పర్యవేక్షణ ఉండాలి.
పాఠశాలలు తెరవడానికి ముందు పాటించాల్సిన మార్గదర్శకాలు:
- కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న పాఠశాలలు మాత్రమే తిరిగి తెరవాలి.
- కంటైన్మెంట్ జోన్లలో నివసించే విద్యార్థులు, ఉపాధ్యాయులకు పాఠశాలకు రావడానికి అనుమతి లేదు.
- అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు కంటైన్మెంట్ జోన్ ప్రాంతాలను సందర్శించకూడదు.
- పాఠశాలల్లో అన్ని ప్రదేశాలను శానిటైజ్ చేయాలి.
- 50% టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ను పాఠశాలలకు అనుమతించాలి.
- 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులు స్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాలలకు రావాలి.
- ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు కాంటాక్ట్లెస్ హాజరు విధానాన్ని అనుసరించాలి.
- పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు గుమికూడకుండా ఉండేలా గుర్తులు ఏర్పాట్లు చేయాలి.
- పాఠశాలల్లో సమావేశాలు, క్రీడలు మరియు రద్దీకి దారితీసే ఇతర కార్యక్రమాలు ఖచ్చితంగా నిషేధించాలి.
- పాఠశాల ప్రాంగణంలో ఉండే స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలి.
- ఫేస్ కవర్లు/మాస్క్లు, హ్యాండ్ శానిటైజర్స్ ను పాఠశాలలు ముందుగానే అవసరమైన విధంగా ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి.
- కరోనా లక్షణాలను కనుగొన్న సమయంలో ఆక్సిజన్ లెవెల్స్ తనిఖీ చేసేలా పల్స్ ఆక్సిమీటర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
- ప్రాంగణంలో తగినంతగా కవర్ డస్ట్బిన్లు మరియు చెత్త డబ్బాలను పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
పాఠశాలలు తెరిచాక పాటించాల్సిన నియమాలు:
- ఎంట్రీ వద్ద తప్పనిసరిగా శానిటైజర్ డిస్పెన్సర్ మరియు థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి.
- ప్రవేశనికి మరియు బయటకు వెళ్లేందుకు సాధ్యమైనంత వరకు వేర్వేరు గేట్లు ఏర్పాటు చేయాలి.
- ఎలాంటి కరోనా లక్షణాలు లేని ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు విద్యార్థులను మాత్రమే ప్రాంగణంలో అనుమతించాలి.
- ఒకవేళ ఎవరికైనా లక్షణాలు ఉంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లేలా సూచించాలి.
- కరోనా నివారణ చర్యలపై పోస్టర్లు/స్టాండ్స్ ఏర్పాటు చేసి ప్రదర్శించాలి.
- పార్కింగ్ స్థలాలలో, కారిడార్లలో మరియు ఎలివేటర్లలో గుంపులుగా గుమికూడకుండా చూడాలి.
- భౌతిక దూర నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
- పాఠశాలలకు వచ్చే సందర్శకుల ప్రవేశాన్ని ఖచ్చితంగా నియంత్రించాలి లేదా పరిమితం చేయాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu