కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై మంగళవారం నాడు సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకూ ఈ స్టే కొనసాగనుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతకొన్ని రోజులుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల రైతులు పెద్దఎత్తున నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు కీలక విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చట్టాలకు సంబంధించి రైతుల సమస్యలు పరిష్కరించడం కోసం ఒక నిపుణుల కమిటీని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసింది.
వ్యవసాయ చట్టాలపై నివేదికను సమర్పించేందుకు కమిటీని ఏర్పాటు చేసే అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చట్టాలపై సమస్యలు ఉన్నవారంతా కమిటీని సంప్రదించగలుగుతారని, అలాగే క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. రైతు సంఘాల నేతలు నేరుగా లేదా న్యాయవాదుల ద్వారా తమ సమస్యలను కమిటీకి వివరించవచ్చని కోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు:
- భూపిందర్ సింగ్ మన్ – భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు
- డాక్టర్ ప్రమోద్ జోషి – విధాన నిపుణుడు
- అశోక్ గులాటి – వ్యవసాయ ఆర్థికవేత్త
- అనిల్ ధన్వత్ – శెట్కారి సంగథన్ ప్రెసిడెంట్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ