సాధారణంగా రెండు దేశాల మధ్య వివాదం అంటే సరిహద్దు గొడవలు, అక్రమ చొరబాట్లు, తమ దేశ సమాచారాన్నిసేకరించడం, యుధ్ద మేఘాలు కమ్ముకునే వాతావరణం లాంటివి అనే అనుకుంటారు. కానీ టీ గురించి రెండు దేశాల మధ్య వివాదం రేగుతుందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అమెరికాకు చెందిన ఓ ప్రొఫెసర్ టీని ఎలా చేయాలో చెబుతూ చేసిన సూచన..ఇప్పుడు యూకే వాసులను చాలా అసంతృప్తికి గురి చేసిందట. దీనిపై ఆ దేశం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో లండన్లోని అమెరికన్ రాయబార కార్యాలయం వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చిందట.
పెన్సిల్వేనియాలోని బ్రైన్ మావర్ కళాశాలలో మిషెల్ ఫ్రాంక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.అయితే మిషెల్కు ఛాయ్ అంటే చాలా ఇష్టమట. దీంతోనే దాన్ని ఎలా తయారు చేయాలో తాను చాలా అధ్యయనం చేశానని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దానికోసం పురాతన గ్రంథాలను కూడా తిరగేశానని.. అనేక పరిశోధన పత్రాలను కూడా చదివానని తెలిపారు.
ఛాయ్ ప్రేమికురాలిగా, కెమిస్ట్రీ ప్రొఫెసర్గా టీకి మంచి టేస్టు రావడానికి తానొక మంచి మార్గం కనుగొన్నానన్నారు. ఛాయ్ చక్కగా కుదరాలంటే దాంట్లో చిటికెడు ఉప్పు వేయాలని మిషెల్ సూచించారు. ఇదే విషయాన్ని మిషెలక ‘స్టీప్డ్: ది కెమిస్ట్రీ ఆఫ్ టీ’ అనే పుస్తకంలోనూ రాశారు. అయితే ఆ పుస్తకం ఇటీవలే యూకేలో విడుదలవడంతోనే వివాదం స్టార్ట్ అయింది.
యూకే జాతీయ పానీయం ఛాయ్. అందుకే టీలో ఉప్పు కలపాలంటూ పుస్తకంలో మిషెల్ ఫ్రాంక్ చెప్పడం అక్కడి వారితో పాటు ఛాయ్ లవర్స్కు ఏమాత్రం రుచించలేదు. దీంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. చాలా మంది ఆన్లైన్లో మిషెల్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఒక కప్పు టీతో ఏమైనా జరగొచ్చనేలా యూఎస్ఏ, యూకే నెటిజన్లు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకున్నారు.
ఇక ఈ వివాదానికి ముగింపు పలకకపోతే ఇంకా ముదురుతుందని భావించిన లండన్లోని అమెరికా రాయబార కార్యాలయం..చివరకు రంగంలోకి దిగింది. చక్కటి ఛాయ్ కోసం అమెరికన్ ప్రొఫెసర్ మిషెల్ చేసిన సూచన యూకేతో తమ బంధాన్ని ఇరకాటంలోకి నెట్టిందని చెప్పింది. ఇది రెండు దేశాలను కలిపే అమృత పానీయం కాబట్టి.. రెండు దేశాల మధ్య బంధాన్ని సవాల్ చేసే ఎలాంటి ప్రతిపాదనలనూ తేలిగ్గా తీసుకోలేమని వివరించింది. కప్పు ఛాయ్లో చిటికెడు ఉప్పు కలపడం అమెరికా అధికారిక విధానం కాదని.. భవిష్యత్లో ఉండదు కూడా అని యూఎస్ఏ స్పష్టం చేయాల్సి వచ్చింది.
అయితే,అంతటితో అని ఊరుకుంటే వివాదం చల్లారేదేమో..కానీ వివరణ చివరలో ఛాయ్ని సరైన మార్గంలో మైక్రోవేవ్ ఒవెన్లోనే తయారు చేస్తామంటూ అమెరికా రాయబార కార్యాలయం చేసిన కామెంట్ మళ్లీ చర్చకు దారి తీసింది. ఈసారి రంగంలోకి దిగిన బ్రిటన్ ప్రభుత్వం..తేనీటిని కేవలం ‘కెటిల్’లో మాత్రమే చేయాలంటూ క్యాబినెట్ ఆఫీస్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.దీంతో ఈ ఛాయ్ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE