ఈ సంవత్సరం నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ అభ్యర్థిగా జో బిడెన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జో బిడెన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. డెమోక్రట్ తరపున ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఆఫ్రికన్-అమెరికన్, భారత సంతతి మహిళ కమలా హారిస్ను ఎంపిక చేసుకున్నారు. దీంతో అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి మహిళగా కమలా హారిస్ గుర్తింపు పొందారు. ఆమె ప్రస్తుతం కాలిఫోర్నియా నుంచి డెమోక్రట్ పార్టీ సెనేటర్గా ఉండగా, జో బిడెన్కు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కూడా పనిచేస్తున్నారు. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడు నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు, కాగా ఆమె తండ్రి ఆఫ్రికాలోని జమైకా దేశస్థుడు.
కమలా హారిస్ ను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేస్తునట్టు జో బిడెన్ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. జమైకా మరియు భారతీయ వలసదారుల కుమార్తెగా కమలా హారిస్ అమెరికా వాగ్దానాన్ని నమ్ముతూ, ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిందని బిడెన్ అన్నారు. అమెరికాను సరైన దారిలో నడిపేందుకు కమలా హారిస్ తనకు చక్కని భాగస్వామి అని, తాము డొనాల్డ్ ట్రంప్ను ఓడించబోతున్నామని బిడెన్ పేర్కొన్నారు. అలాగే కమలా హారిస్ స్పందిస్తూ, “జో బిడెన్ అమెరికన్ ప్రజలను ఏకం చేయగలడు, ఎందుకంటే అతను మన కోసం పోరాడుతూ తన జీవితాన్ని గడిపాడు. అధ్యక్షుడిగా, అతను మన ఆదర్శాలకు అనుగుణంగా ఉండే అమెరికాను నిర్మిస్తాడు. మా పార్టీ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నానని” ట్వీట్ చేశారు. మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ను ఎంపిక చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ తన ఎంపిక తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu