పౌరసత్వ సవరణ బిల్లు డిసెంబర్ 11, బుధవారం నాడు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాజ్యసభలో ఈ బిల్లుపై వివిధ పార్టీల సభ్యులు వ్యక్తపరిచిన సందేహాలకు హోం మంత్రి అమిత్ షా వివరణ ఇచ్చారు. ఓటింగ్ జరిగే సమయంలో సభలో 224 మంది సభ్యులు ఉండగా, ఈ బిల్లుకు అనుకూలంగా 117 మంది, వ్యతిరేకంగా 92 మంది ఓటేశారు. సభలో మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపడంతో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందినట్లుగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. పౌరసత్వ సవరణ బిల్లు ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదంతో ఈ చట్టం అమలులోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన దాడులు, హింస కారణంగా ఇబ్బందులు ఎదుర్కోని భారతదేశానికి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన్, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించనున్నారు.
ముందుగా ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలా వద్దా అన్నదానిపై రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించారు. సెలెక్ట్ కమిటీకి పంపొద్దని 124 మంది, పంపించాలని 99 మంది సభ్యులు ఓటు వేశారు. ఓటింగ్ తర్వాత బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈ క్రమంలో బిల్లుపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలు కూడా వీగిపోయాయి. వీటిలో కొన్ని సవరణలు మూజువాణి ఓటుతో వీగిపోయినట్టుగా వెంకయ్య నాయుడు ప్రకటించారు. మరో వైపు లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు శివసేన పార్టీ మద్దతు తెలుపుతూ ఓటు వేయగా, రాజ్యసభలో మాత్రం ఓటింగ్ సమయంలో శివసేన సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
[subscribe]