దేశంలో కరోనా మహమ్మారి నెలకొని ఉన్న ప్రస్తుత గడ్డు సమయంలో కూడా రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలు కాపాడుటకై రైతులు పండించిన ప్రతి వరి గింజను ఎటువంటి వ్యయ ప్రయాశాలనైన ఎదుర్కోని కొనుగోలు చేయాలనీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అందులో భాగంగా ఇప్పటివరకు 9,18,664 మంది రైతులనుండి కనీస మద్దతు ధర చెల్లించి సుమారు రూ.11,000 కోట్లు విలువ గల 40.06 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇందులో సన్న ధాన్యము 14.81 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, దొడ్డు ధాన్యము 25.25 లక్షల మెట్రిక్ టన్నులు ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6441 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి కొనుగోలు కేంద్రము వద్ద సరిపడ హమలీలను మరియు ఇతర సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదే మాదిరిగా సుమారు 15 కోట్ల గొనె సంచులను కొనుగోలు కేంద్రముల వద్ద అందుబాటులో ఉంచామన్నారు.
వరి ధాన్యము కొనుగోలు చేసిన 3 లేదా 4 రోజులలోనే రైతులకు వారి బ్యాంకు ఖాతాలలో నేరుగా డబ్బు జమ చేయడము జరుగుతుందని అన్నారు. రైతులు వారి యొక్క ధాన్యమును అమ్ముకోనుటలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబరు 180042500333 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రైతుల అందరు ఒకేసారిగా కొనుగోలు కేంద్రముల వద్ద గుమిగూడకుండా వారికి టోకెన్లను జారీ చేసి వాటిపై రైతు కొనుగోలు కేంద్రమునకు తీసుకు రావలిసిన రోజు, సమయమును సూచిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు వర్తకులు/ ట్రేడర్స్ సన్న వరి ధాన్యమును కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర పెట్టి సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యమును కొనుగోలు చేశారని తెలిపారు. ఇంకా సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని, సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఎంత వరి ధాన్యాన్నైనా కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాలశాఖ సిద్ధంగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ