అంచనాలను తలక్రిందులు చేసేలా వచ్చిన ఎగ్జిట్ పోల్స్తో.. అధికార బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేయడంలో బీజీ అయిపోయింది. 119 నియోజకవర్గాలలో మండలాల వారీగా పోలైన ఓట్ల వివరాలను తెలుసుకుంటూ.. అధికారాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్పై లెక్కలు వేస్తోంది. ఇటు ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విశ్లేషిస్తూనే.. బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల ప్రభావం ఎంత వరకూ ఉందనే అంశాలను సీఎం కేసీఆర్ తెలుసుకుంటున్నారు. ఎన్ని నియోజకవర్గాల్లో తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ ఆరా తీస్తున్నారు.
ఒక్కో నియోజకవర్గంలో మండలాలతో పాటు.. గ్రామపంచాయతీలు, మేజర్ గ్రామపంచాయతీల వారీగా నమోదయిన పోలింగ్ శాతాన్ని బీఆర్ఎస్ అధిష్టానం లెక్కలు వేస్తోంది. ఇప్పటి వరకూ కొన్ని నియోజకవర్గాల వివరాలను తెప్పించుకున్న అధికార పార్టీ.. నియోజకవర్గాల వార్ రూం ఇన్చార్జులతోనూ సమీక్షిస్తోంది. ఏ గ్రామంలో ఎన్ని ఓట్లున్నాయి.. ఎన్ని ఓట్లు పోలయ్యాయి వంటి వివరాలను సేకరిస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆధిక్యం ఉన్న గ్రామాల వివరాలను కూడా పరిశీలిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేసీఆర్ పక్కా వ్యూహాలు రచించి దానికి అనుగుణంగా ప్రచార సరళి చేపట్టారు. గురువారం ఎన్నికల పోలింగ్ జరుగుతుండగానే గంటగంటకు పోలింగ్ సర్వే రిపోర్ట్ తెప్పించుకొని ఏ జిల్లాలో తక్కువ పోలింగ్ నమోదైందనే వివరాలు సేకరించారు. వెంటనే కేడర్కు పోలింగ్ శాతం పెంచేలా సూచనలు కూడా ఇచ్చినట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ ప్రతి గ్రామానికి ఇచ్చిన ఎన్నికల ఖర్చుపైనా కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ వారు ఎంతమంది ఓటర్లను కలిశారనే వివరాలతో పాటు.. ఎవరికైనా తాయిలాలు ఇస్తే వారి వివరాలు కూడా లెక్కలతో సహా తమకు వివరించాలని ఆదేశించింది. ఎందుకంటే ప్రచారం సమయంతో పాటు పోలింగ్ సమయంలో నేతల పనితీరు కూడా ఎన్నికల లెక్కింపు రోజు తెలియనుంది. వారి పనితీరు ఆధారంగా ఇప్పటికే వారికి పదవుల హామీలను కూడా అధికార పార్టీ ఇచ్చేసిందట. అంతేకాదు ఆయా పోలింగ్ బూత్లకు పార్టీ ఇన్చార్జిలని బాధ్యులను చేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఉన్న 13 సమస్యాత్మక నియోజకవర్గాలు అయిన మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలోనూ జరిగిన పోలింగ్ శాతాన్ని గులాబీ బాస్ ఎంక్వైరీ చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి, ఇచ్చిన హామీలతో ఎన్ని నియోజకవర్గాల్లో తాము గెలుస్తామనే లెక్కలు వేస్తున్నారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి 46.8 శాతం ఓట్లు రావడంతో.. ఈ సారీ ఇంచుమించు అలాగే వస్తుందని పార్టీ వర్గాలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.. పోలింగ్ ఒకటీ రెండు శాతం తగ్గినా ..ప్రభుత్వ ఏర్పాటుకే ఏ మాత్రం ఢోకాలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. మరోవైపు తటస్థ ఓటర్లపై గులాబీ బాస్ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వచ్చిన పోల్ పర్సంటేజీ ఇప్పుడు కూడా వస్తుందని ఆశిస్తున్నారు. అలాగే 2018 ఎన్నికల సమయంలోనూ ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే వచ్చాయి కాబట్టి.. ఈ ఎగ్జిట్ పోల్స్ అదే రిపీట్ చేస్తుందన్న ధీమాలో కేసీఆర్ ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE