లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా చెప్పుకునేలా 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ మరింత ఉత్కంఠను పెంచాయి. 4 రాష్ట్రాలలో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడగా.. తెలంగాణలో మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారంలోకి రానున్నట్లు చెప్పాయి. అయితే వీటిలో చాలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఓ వైపు తెలంగాణలో పోలింగ్ జరుగుతుండగానే వెలువడ్డాయి.
ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా మాత్రమే తెలంగాణపై తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నట్టు తెలిపింది. ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ అధికారం నిలుపుకోనుందని చాలా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియాతో పాటు టైమ్స్ నౌ-ఈటీజీ, ఇండియా టీవీ-సీఎన్ఎక్స్, టుడేస్ చాణక్య కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్కే కట్టబెట్టాయి. అయితే ఏబీపీ-సీవోటర్, జన్ కీ బాత్ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ల్లో ఎవరిదైనా పై చేయి కావచ్చని అన్నాయి.
ఇక రాజస్తాన్లో అధికార కాంగ్రెస్ను.. భారతీయ జనతా పార్టీ ఓడించనుందని టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ, జన్ కీ బాత్, టుడేస్ చాణక్యతో పాటు చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. అయితే బీజేపీకి 86 -106, కాంగ్రెస్కు 80 – 100 సీట్లొస్తాయని ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. కాంగ్రెస్ 94 – 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ తెలిపింది. అలాగే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినా కూడా..అధికారం మాత్రం బీజేపీదే అని చాలా సర్వేలు తెలిపాయి.
ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా 230 సీట్లకు గాను దానికి బీజేపీకి 162 సీట్ల దాకా వస్తాయని పేర్కొనగా.. టుడేస్ చాణక్య 151, ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ 159 దాకా రిపబ్లిక్ టీవీ 130 దాకా వస్తాయని చెప్పాయి. ఏబీపీ-సీవోటర్ మాత్రం కాంగ్రెస్కు 113 – 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 – 112కు పరిమితమవుతుందని చెప్పింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో మాత్రం అధికార ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం హోరాహోరీగా తలపడ్డట్టు.. హంగ్ వచ్చే అవకాశాలున్నట్లు సర్వేలు చెప్పాయి.
మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నా సరే.. తెలంగాణలో పోలింగ్ సరళి ఎవరికీ కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. చివరకు ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా సంస్థ కూడా తెలంగాణలో పోలింగ్ తీరు తెన్నులను అంచనా వేయలేకపోయింది. గురువారం సాయంత్రం గడువు దాటాక కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండటం, చాలామంది తాము ఓటు వేసిన పార్టీ గురించి బయటపెట్టకపోవడంతో ఎవరికీ క్లారిటీ రాలేదన్న వాదన వినిపిస్తోంది.
దీంతోనే కచ్చితమైన ఎగ్జిట్ పోల్ గురించి ఎవరూ అంచనా వేయలేకపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో డిసెంబర్ 3న వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE